టాప్‌ 10 సంపన్న టెక్‌ దిగ్గజాలు

20 Oct, 2017 09:38 IST|Sakshi


సాక్షి,న్యూఢిల్లీ: ఫోర్బ్స్‌ ఇండియా 2017 జాబితాలో టెక్‌ దిగ్గజాలకు చోటు దక్కింది. డిజిటల్‌ ప్రపంచంలో సత్తా చాటుతూ లాభాల పంట పండిస్తున్న టెక్ బిలియనీర్ల సంపద వేగంగా పెరుగుతోంది. 2016లో భారత బిలియనీర్ల సంపద 26 శాతం వృద్ధితో 2017 నాటికి 47,900 కోట్ల డాలర్లకు ఎగబాకడం గమనార్హం. భారత బిలియనీర్లలో టెక్‌ దిగ్గజాలకు గణనీయమైన స్థానం దక్కింది. వీరిలో టాప్‌ 10 టెక్‌ బిలియనీర్లను పరిశీలిస్తే...


ముఖేష్‌ అంబానీ
రిలయన్స్‌ జియోతో టెక్నాలజీ స్పేస్‌లో అడుగుపెట్టిన ఆర్‌ఐఎల్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా బిలియనీర్ల జాబితాలో నెంబర్‌ వన్‌గా నిలిచారు. ముఖేష్‌ నికర ఆస్తులు రూ రెండు లక్షల కోట్లుగా ఫోర్భ్స్‌ లెక్కగట్టింది. జియోతో టెలికాం రంగంలో పెనువిప్లవం తీసుకువచ్చిన ముఖేష్‌ అంబానీ తాజాగా కేవలం రూ 1500కే జియో ఫోన్‌ను ఆఫర్‌ చేసి సంచలనం సృష్టించారు. ఈ మొత్తం సైతం మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చే సెక్యూరిటీ డిపాజిట్‌ గానే కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తున్నారు.


అజీం ప్రేమ్‌జీ
విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ ఫోర్భ్స్‌ ఇండియన్‌ టెక్‌ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌, ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన విప్రోకు దిశానిర్ధేశం చేసిన ప్రేమ్‌జీ నికర ఆస్తులు రూ 1,20,000 కోట్లని ఫోర్భ్స్‌ అంచనా.


శివ్‌ నాడార్‌
టాప్‌ టెన్‌ టెక్‌ బిలియనీర్ల జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్ధాపకులు శివ్‌ నాడార్‌ మూడో స్ధానంలో నిలిచారు.ఫోర్భ్స్‌ భారత బిలియనీర్ల లిస్ట్‌లో ఏడవ స్థానంలో ఉన్న శివ్‌ నాడార్‌ నికర ఆస్తులు రూ 75,000 కోట్లకు పైమాటే. 1976లో ఆయన చేతులమీదుగా ప్రారంభమైన హెచ్‌సీఎల్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టెక్‌ సంపన్నుల జాబితాలో శివ్‌ నాడార్‌ 18వ ర్యాంక్‌ సాధించడం గమనార్హం.


సునీల్‌ మిట్టల్‌
ఫోర్బ్స్‌ ఇండియా సంపన్నుల జాబితాలో టెక్నాలజీ పరిశ్రమ నుంచి భారతి ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ తదుపరి స్ధానంలో నిలిచారు. ఫోర్భ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన నికర ఆస్తులు రూ 54,000 కోట్లు. టెలికాం రంగంలో సత్తా చాటిన ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం రిలయన్స్‌ జియోతో టారిఫ్‌ వార్‌తో ఢీకొంటోంది. ఈ ఏడాది ఆరంభంలో కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను నెలకొల్పింది.


అనిల్‌ అంబానీ
ముఖేష్‌ అంబానీ సోదరుడు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ టెక్‌ సంపన్నుల జాబితాలో 5వ స్ధానంలో నిలిచారు.ఫోర్భ్స్‌ అంచనా ప్రకారం అనిల్‌ అంబానీ నికర ఆస్తులు రూ 20,000 కోట్లు.


ఇక ఫోర్భ్స్‌ బిలియనీర్ల జాబితా ప్రకారం టెక్‌ బిలియనీర్ల టాప్‌ 10 లిస్ట్‌లో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, దినేష్‌ నంద్వానా, నందన్‌ నిలేకాని, ఎస్‌ గోపాలక్రిష్ణన్‌లున్నారు.

మరిన్ని వార్తలు