8% వృద్ధికి మరో రెండేళ్లు ఆగాల్సిందే: ఫిచ్

4 Oct, 2016 01:43 IST|Sakshi
8% వృద్ధికి మరో రెండేళ్లు ఆగాల్సిందే: ఫిచ్

2018-19లోనే ఇది సాధ్యమవుతుందని అంచనా

న్యూఢిలీ: భారత్ ఎనిమిది శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న  ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. 2016-17లో భారత్ వృద్ధి రేటును 7.4 శాతంగా అంచనావేసిన ఫిచ్ ద్వైమాసిక గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ) నివేదిక,  2017-18లో ఇది 7.9 శాతానికి చేరుతుందని పేర్కొంది. 2018-19లో  8 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2015-16లో వృద్ధి రేటు 7.9 శాతం కావడం గమనార్హం.  సంస్కరణల ఫలితాలు, సరళతర ద్రవ్య పరపతి విధానం ఈ వృద్ధి రేటుకు కారణంగా పేర్కొంది.  నివేదిక అంశాలను చూస్తే...

2016 చివరినాటికి బ్యాంకులకు తానిచ్చే రుణ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావు శాతం తగ్గిస్తుంది.  2017లో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రేటు 6.5 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వ వ్యయాలు పెరగడం, తగిన వర్షపాతం కూడా ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశాలు.

సంస్కరణలు ప్రత్యేకించి ఇటీవల వస్తు, సేవల పన్ను బిల్లుకు పార్లమెంటు ఆమోదం సమీపకాలంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడ్డానికి దోహదపడతాయి.

ఫిచ్20 ఆర్థికవ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది. 

గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రైవేటు వినియోగం వృద్ధి 6.7 శాతంగా ఉంది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతానికి చేరే వీలుంది. అయితే  పెట్టుబడుల అంశం ప్రస్తుతం ప్రతికూలాంశం. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అసలు వృద్ధిలేకపోగా 3.1 శాతం క్షీణించింది.  అయితే ఈ విభాగంసైతం 2017-18లో 6.3 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం.

ఇక ఎగుమతులు బలహీన దోరణిలోనే కొనసాగే వీలుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదుచేసుకునే వీలుంది.

{దవ్యోల్బణం క్రమంగా పెరిగి 2016 చివరకు 5.5 శాతానికి, 2017 చివరికి 5.8  శాతానికి చేరే వీలుంది. 2018 చివరికి 6 శాతానికి పెరగవచ్చు.  మరోపక్క, వచ్చే ఐదేళ్లకాలానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4  శాతంగా(రెండు శాతం అటూ ఇటుగా) నిర్ణయించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు