మళ్లీ పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు

31 Aug, 2017 18:35 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దిగజారిన వృద్ధి రేటు, కొత్త పన్ను విధానం జీఎస్టీతో మరింత కిందకి పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టంలో 5.7 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల అధికారి నేడు(గురువారం) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంది. డీమానిటైజేషన్‌ ప్రభావంతో గత త్రైమాసికంలో కూడా జీడీపీ 6.1 శాతానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఈ ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుందని, జీడీపీ వృద్ధి రేటు పుంజుకోవచ్చని పలువురు భావించారు. కానీ అటు నోట్‌ బ్యాన్‌తో పాటు, ఇటు జీఎస్టీ ప్రభావం కూడా ఈ సారి జీడీపీ వృద్ధి రేటు పడి, మరింత కిందకి దిగజారింది. 
 
జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకాకముందు కూడా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అనిశ్చితిగా, గందరగోళంగా ఉంది. ప్రీ-జీఎస్టీ సేల్‌తో రిటైలర్లు తమ ఇన్వెంటరీని పూర్తిగా ఖాళీ చేసుకోవాలని చూశారు. అంతేకాక జూలై 1 తర్వాత ధరలు ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన రిటైలర్లు, వచ్చే నెలకు ఎలాంటి స్టాక్‌ ఉండకూడదని ప్రీ-జీఎస్టీ సేల్‌, డిస్కౌంట్లతో స్టాక్‌ను విక్రయించేశారు. ఇది వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2016 మార్చి నుంచి జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తోంది. దీంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను కూడా భారత్‌ కోల్పోయింది.  
మరిన్ని వార్తలు