బడ్జెట్‌ రూపకల్పన.. ఆసక్తికర విషయాలు

31 Jan, 2018 19:55 IST|Sakshi
బడ్జెట్‌ పత్రాల ముద్రణకు ముందు 'హల్వా వేడుక'

బడ్జెట్‌.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!!

సెప్టెంబర్‌లో మొదలు..
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్‌ చర్చలు..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్‌లో బ్లూ ప్రింట్స్‌
ముసాయిదా బడ్జెట్‌ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

కొత్త ఏడాది ప్రారంభంలో సలహాలు, సూచనలు
పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ షురూ..
ఇక 'హల్వా వేడుక'తో బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది.  ప్రతి సంవత్సరం బడ్జెట్‌ పత్రాల ముద్రణకు ముందుగా 'హల్వా వేడుక' నిర్వహించడం ఆనవాయితీ. వేడుక అనంతరం ఆర్థిక శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌లో బిజీ అవుతారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం  పూర్తయ్యేంత వరకు దాదాపు వందమంది అధికారులు ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే వుంటారు.  బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్‌ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేస్తుంటుంది.

ఉద్యోగులపై డేటా కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

అంతా 'ప్రత్యేకం'
బడ్జెట్‌ పత్రాలను తయారు చేసే 'ప్రింటింగ్‌ ప్రెస్‌' సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

నీడలా వెన్నంటే..
ముద్రణ విభాగం సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా  బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

వారిద్దరికీ ముందుగానే...
సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్‌ గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. 

పార్లమెంట్‌ ముందుకు బ్రీఫ్‌కేసు..
ఇక చివరికి బడ్జెట్‌ పత్రాలు కలిగి ఉన్న బ్రీఫ్‌కేసును తీసుకుని ఆర్థిక మంత్రి పార్లమెంట్‌ ముందుకు వస్తారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. 

మరిన్ని వార్తలు