5రోజూ లాభాల ముగింపే
552 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్
రాణించిన ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ రంగ షేర్లు
స్టాక్ మార్కెట్ వరుసగా 5రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 522 పాయింట్లు పెరిగి 33825.53 వద్ద, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 9979.10 వద్ద స్థిరపడ్డాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫైనాన్స్ రంగ షేర్ల ర్యాలీ సూచీలను నడిపించాయని చెప్పవచ్చు. లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభమై అనుకున్న దానికన్నా తక్కువగానే ఎన్పీఏలు నమోదు కావచ్చనే అశావహన అంచనాలతో బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్లు ర్యాలీ చేస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 5 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 18శాతం లాభపడింది. గత రెండు వారాల్లో నిఫ్టీ పైనాన్స్ ఇండెక్స్ 17శాతం పెరిగింది. మార్కెట్ ప్రారంభం నుంచి ఒక్క ఎఫ్ఎంసీజీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 563 పాయింట్ల వరకు లాభపడి 33,866.63 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 9,995.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.
డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, బీపీసీఎల్, మారుతి, కోల్ ఇండియా షేర్లు 1.50శాతం నుంచి 3.35శాతం నష్టపోయాయి. టాటామోటర్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ఫైనాన్స్, జీ లిమిటెడ్, బజాజ్ఫిన్ సర్వీసెస్ షేర్లు 7.50శాతం నుంచి 9.50శాతం లాభంతో ముగిశాయి.