ఇండిగోకు ఏమైంది? మరో 32 విమానాలు రద్దు

11 Feb, 2019 09:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో  ఏకంగా32 విమానాలను రద్దు చేసింది.పైలట్ల కొరత కారణంగా ఈ  సమస్య  ఏర్పడిందని విమాన్రాశయ అధికారులు చెబుతున్నారు.  ఢిల్లీ, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌నుంచి బయలు దేరాల్సిన విమానాలను రద్దు చేసింది.  శనివారం15, ఆదివారం 7విమానాలను రద్దు చేయగా,   సోమవారం 32 విమాన సర్వీసులను రద్దు చేసిందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. 

అయితే దీనిపై ఇండిగో వాదన మరోలా ఉంది. ఉత్తర ఇండియాలో సంభవించిన తీవ్ర వడగళ్లవానతో ఫిబ్రవరి 7,11 తేదీల్లో అనేక విమాన సర్వీసులను దారిమళ్లించాల్సి వచ్చిందని దీంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే షెడ్యూల్‌ను పునరుద్ధరించడం, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో కొన్ని విమానాలను రద్దు చేయాల్సివచ్చిందని తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. 

మరోవైపు హైదరాబాద్‌ నుంచి పుణే వెళ్లవలసిన ఇండిగో విమానం శనివారం అయిదు గంటలకుపైగా ఆలస్యంగా  బయలుదేరింది. పైలెట్‌ విధులకు హాజరు కాకపోవడంతో తెల్లవారుఝామున 4గంటల బయలు దేరాల్సిన విమానం ఉదయం 9.30 నిమిషాలకు బయలుదేరింది. మరో  విమానం కోసం గంటముందు విధులకు హాజరైన పైలెట్‌ను సర్దుబాటు చేశారు. దీంతో హైదారాబాద్‌ విమానా​శ్రయంలో180 మందికి పైగా ప్రయాణికులు ఇండిగో విమానంలో పడిగాపులు కాచారు.

అటు సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్స్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ఆదివారం 10 విమానాలను రద్దు చేసింది. నిర్వాహణ వ్యవహారాల కారణంగా వీటిని నిలిపివేస్తున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.  ఒక్క ముంబై విమానాశ్రయం నుంచే దాదాపు 10 సర్వీసులను  రద్దు చేసినట్టు సమాచారం. దీంతో  ప్రయాణికుల  అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 

మరిన్ని వార్తలు