ఆఫర్లతో దిగొస్తున్న విమానాలు

25 May, 2017 00:12 IST|Sakshi
ఆఫర్లతో దిగొస్తున్న విమానాలు

జాబితాలో స్పైస్‌జెట్, ఇండిగో, జెట్, ఎయిర్‌ఏసియా
బుక్‌ చేసుకోవటానికి మరో నాలుగు రోజుల సమయం
వచ్చే ఏడాది మార్చి వరకూ ప్రయాణించే వీలు  


న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగంలో మరోసారి ధరల యుద్ధానికి తెరలేచింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు పోటీపడి మరీ టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వార్షికోత్సవ ఆఫర్‌ అంటూ తొలుత స్పైస్‌జెట్‌ ఈ పోటీకి తెరతీయగా... ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ఏసియా వంటి సంస్థలన్నీ వరస కట్టాయి.

స్పైస్‌జెట్‌: రూ.12 బేసిక్‌ ఫేర్‌తో టికెట్‌
స్పైస్‌జెట్‌ తన 12వ వార్షికోత్సవమంటూ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12ల బేసిక్‌ ఫేర్‌తో వన్‌వే టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. దీనికి ట్యాక్స్‌లు, సర్‌చార్జ్‌లు అదనం. మే 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్న వారు 2017 జూన్‌ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇక టికెట్లను బుక్‌ చేసుకున్న వారు సంస్థ నిర్వహించే లక్కీడ్రాలో ఉచిత టికెట్లతోపాటు పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.  

ఇండిగో టికెట @ రూ. 899
ఈ రేసులో చేరిన ‘ఇండిగో’ తాజాగా రూ.11 బేసిక్‌ ఫేర్‌తో టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌కు తెరలేపింది. ఈ ప్రమోషనల్‌ స్కీమ్‌లో భాగంగా కంపెనీ వన్‌వే టికెట్లను రూ.899 ప్రారంభ ధరతో ప్రయాణికులకు ఆఫర్‌ చేస్తోంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు 2017 జూన్‌ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో తాజా ఆఫర్‌ కింద విశాఖపట్నం–హైదరాబాద్‌ టికెట్‌ను రూ.1,104లకు, హైదరాబాద్‌–విశాఖపట్నం టికెట్‌ను రూ.1,441లకు, బెంగళూరు–హైదరాబాద్‌ టికెట్‌ను రూ.1,250లకు, శ్రీనగర్‌–జమ్మూ టికెట్‌ను రూ.899లకు అందిస్తోంది. పలు రూట్లలో ఇలాంటి ఆఫర్లున్నాయి.

రేసులోకి జెట్‌ ఎయిర్‌వేస్‌
ఈ విమానయాన సంస్థ కూడా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.1,079 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఇది గ్రూప్‌ బుకింగ్స్‌కు వర్తించదు. ఈ నెల 26 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్న వారు ఈ ఏడాది జూన్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.

ఎయిర్‌ ఏసియా కూడా..
టాటా–ఎయిర్‌ఏíసియా జాయింట్‌ వెంచర్‌ అయిన ఎయిర్‌ఏసియా ఇండియా కూడా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌వే రూట్లకు మాత్రమే వర్తించే ఆఫర్‌ ఇది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్న వారు ఈ ఏడాది నవంబర్‌ 23 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దీనికి టికెట్‌ ప్రారంభ ధర రూ.1,699.

మరిన్ని వార్తలు