పారిశ్రామికం నేల చూపు

13 Jul, 2018 00:28 IST|Sakshi

  మే నెలలో కేవలం 3.2 శాతం వృద్ధి

 తయారీ, విద్యుత్‌ రంగాలు పేలవం  

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం– ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్‌ రంగాల పేలవ పనితీరును ప్రదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలను చూస్తే (ఏప్రిల్, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే... 

తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది.  

విద్యుత్‌: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది.  

మైనింగ్‌: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలను కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది.  

ఎఫ్‌ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా – 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే  నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం.  
కన్జూమర్‌ గూడ్స్‌: కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో వృద్ధిలేకపోగా –2.6 క్షీణత నెలకొంది.  
 

మరిన్ని వార్తలు