పారిశ్రామిక రంగం పరుగులు

13 Oct, 2017 12:49 IST|Sakshi

ఆగస్ట్‌లో వృద్ధి 4.3 శాతం

తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరిక

మైనింగ్, విద్యుత్‌ రంగాల మెరుగైన పనితీరు

న్యూఢిల్లీ: పారిశ్రామిక వృద్ధి మళ్లీ పరుగు అందుకుంది. ఆగస్ట్‌లో 4.3 శాతం వృద్ధితో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మైనింగ్, విద్యుత్‌ రంగాల చక్కని పనితీరుతో ఇది సాధ్యపడింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఆగస్ట్‌లో 4 శాతంగా నమోదు కావటం గమనార్హం.

2016 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 5.7 శాతంగా నమోదు కాగా, ఆ తర్వాత తిరిగి మళ్లీ అధిక స్థాయికి చేరడం ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు చూసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి నిదానించిందనే చెప్పుకోవాలి. ఈ కాలంలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగా, 2016 ఏప్రిల్‌–ఆగస్ట్‌ కాలంలో ఇది 5.9 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది జూలై ఐఐపీ గణాంకాలను గతంలో ప్రకటించిన 1.2 శాతం నుంచి 0.94 శాతానికి కేంద్రం సవరించింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం మారలేదు
రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 3.28 శాతంగా నమోదైంది. ఆగస్ట్‌లో ఇది 3.36 శాతం ఉన్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దాన్ని 3.28 శాతానికి సవరించింది. దీంతో ఆగస్ట్‌ నెలలో ఉన్నట్టుగానే సెప్టెంబర్‌ నెలలోనూ ద్రవ్యోల్బణం రేటు కొనసాగింది. కూరగాయలు, ధాన్యం ధరలు నెమ్మదించినట్టు ప్రభుత్వం తెలిపింది. కూరగాయల ధరలు 9.97 శాతం నుంచి 3.92 శాతానికి తగ్గాయని పేర్కొంది. 2016 సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.39 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు