సీఈవోకు క్లీన్‌ చిట్‌, షేర్లు జూమ్‌

13 Jan, 2020 10:34 IST|Sakshi

సాక్షి,ముంబై:   అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌  షేర్లు  సోమవారం భారీగా లాభపడుతున్నాయి.శుక్రవారం మార్కెట్‌ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో   మెరుగైన లాభాలను సాధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇన్ఫీ షేర్లలోకొనుగోళ్లకు ఎగబడ్డారు. దీనికితోడు సవరించిన రెవెన్యూ గైడెన్స్‌, ఆర్థిక అవకతవకల  ఆరోపణలపై  సీఈవో సహా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం కూడా సెంటిమెంట్‌ను బాగా ప్రభావితం చేసింది.  దీంతో 4 శాతానికి  ఎగిసిన ఇన్ఫీ షేరు మార్కెట్‌లో టాప్‌ విన్నర్‌గా కొనసాగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఐటీ మేజర్ ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను సాధించింది.  జనవరి 10న ప్రకటించిన ఫలితాల్లో 2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో లాభం 23 శాతం  ఎగిసి రూ .4,466 కోట్ల నమోదు చేసింది. ఆదాయం 7.95 శాతం పెరిగి రూ .23,092 కోట్లకు చేరింది. దీనికి తోడు భారీ ఆర్డర్లు లభించడంతో  2020 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్‌ 10 -10.5 శాతానికి సవరించింది.  మరోవైపు సంస్థలో ఆర్థిక తప్పులు,  దుష్ప్రవర్తనకు సంబంధించి  బోర్డు  ఆడిట్ కమిటీకి ఎలాంటి ఆధారాలు  లభించలేదని సంస్థ  తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 21న విజిల్‌ బ్లోయర్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్,  సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ అనైతిక పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన  సంస్థ  తాజాగా ఈ విషయాలను సంస్థ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు