ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌పై ఈ నెల 11న నిర్ణయం 

9 Jan, 2019 01:53 IST|Sakshi

అదే రోజు క్యూ3 ఫలితాల వెల్లడి  

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై ఈ నెల 11న బోర్డు చర్చించనుంది. దీంతో పాటు ప్రత్యేక డివిడెండ్, ఇతర  ప్రతిపాదనలపై కూడా ఈ బోర్డ్‌ సమావేశంలో చర్చ జరుగుతుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఆ రోజునే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా వెల్లడిస్తామని పేర్కొంది. వాటాదారులకు రూ.13,000 కోట్లు చెల్లించనున్నట్లు గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ కంపెనీ వెల్లడించింది.

దీంట్లో భాగంగానే గత ఏడాది జూన్‌లో ఒక్కో షేర్‌కు రూ.10 ప్రత్యేక డివిడెండ్‌ చొప్పున మొత్తం రూ.2,600 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.10,400 కోట్ల నిధులను వాటాదారులకు ఎలా చెల్లించాలనేది తర్వాతి కాలంలో డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయిస్తుందని గతంలోనే ఇన్ఫోసిస్‌ తెలిపింది. ప్రీ క్యాష్‌ ఫ్లోస్‌లో 70 శాతం వరకూ నిధులను వాటాదారులకు చెల్లించాలన్న తమ విధానాన్ని కొనసాగిస్తామని అప్పుడే ఈ కంపెనీ వెల్లడించింది.    

మరిన్ని వార్తలు