జీనోమ్‌ వ్యాలీకి కంపెనీల వెల్లువ

7 Sep, 2018 01:21 IST|Sakshi

  రూ. 800 కోట్ల ప్రాజెక్టుల రాక

 ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్, లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌ అయిన జీనోమ్‌ వ్యాలీలో కొత్త కంపెనీలు కొలువుదీరుతున్నాయి. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆవిష్కరించారు. జెనెసిస్‌ బయాలాజిక్స్‌ అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఈ సందర్భంగా ప్రారంభించింది. ఈ కేంద్రం కోసం కంపెనీ మొత్తం రూ.350 కోట్లు వెచ్చించనుంది.

కెనడాకు చెందిన జనరిక్‌ డ్రగ్‌ కంపెనీ జంప్‌ ఫార్మా తన ఆర్‌అండ్‌డీ, తయారీ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రెండేళ్లలో ప్రత్యక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ 50,000 చదరపు అడుగుల ఫెసిలిటీని ప్రారంభించింది. టచ్‌స్టోన్‌ స్క్వేర్‌ పేరుతో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పనున్న ఆర్‌అండ్‌డీ పార్క్‌కు శంకుస్థాపన జరిగింది. 

మరిన్ని వార్తలు