జియోలో మరో భారీ పెట్టుబడి

3 Jul, 2020 09:02 IST|Sakshi

11 వారాల్లో 12 భారీ ఒప్పందాలు

జియో  ప్లాట్‌ఫామ్‌లలో ఇంటెల్‌ క్యాపిటల్‌ భారీ పెట్టుబడి

సాక్షి, ముంబై:  ప్రముఖ టెలికాం సంస్థ  రిలయన్స్ జియో మరో భారీ పెట్టుబడిని సాధించింది. జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇంటెల్ క్యాపిటల్ 1,894.50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వరుస పెట్టుబడులతో రికార్డు సాధిస్తున్న ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం ఈక్విటీ వాటా ఇంటెల్‌కు దక్కనుంది. ఈక్విటీ విలువ 4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ 5.16 లక్షల కో'ట్ల రూపాయలుగా ఉండనుంది. గత 11 వారాల్లో 12 దిగ్గజ సంస్థల నుంచి  భారీ పెట్టుబడులను  జియో సొంతం చేసుకుంది. ఈ మొత్తం పెట్టుబడి విలువ 117,588.45 కోట్లకు చేరింది.  (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ)

ఈ డీల్‌పై​ ఇరు సంస్థలు ఆనందాన్ని వెలిబుచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న నిజమైన పరిశ్రమ లీడర్‌ ఇంటెల్‌ అని  అంబానీ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది. జియో కూడా వినూత్నంగా, వృద్ధి కోసం పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ప్రకటించింది. డిజిటల్‌ సౌకర్యం, డేటా సేవలు, వ్యాపారాన్ని, సమాజాన్ని మెరుగ్గా మార్చగలవని తాము విశ్వసిస్తున్నామని ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ వెండెల్ బ్రూక్స్  పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు