చోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్‌

13 Dec, 2018 12:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రూ 13,000 కోట్ల పీఎన్‌బీ బ్యాంకు స్కామ్‌ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు మెహుల్‌ చోక్సీపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది. సీబీఐ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్‌ చోక్సీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. బ్యాంకులను మోసగించిన కేసులో చోక్సీపై దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీలు ముంబై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయడం‍తో అమెరికా అధికారులు చోక్సీని గుర్తించి అతడి సమాచారాన్ని భారత్‌కు చేరవేయనున్నారు.

బ్యాంకు స్కామ్‌ వెలుగుచూసినప్పటి నుంచి అమెరికాలో వైద్య చికిత్సల కోసం వెళ్లిన చోక్సీ తిరిగి భారత్‌కు చేరుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ కదలికలను పసిగట్టి ఆయనను దేశం విడిచివెళ్లకుండా అమెరికా అధికారులు జల్లెడపట్టనున్నారు. కాగా చోక్సీ ప్రస్తుతం తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే పరిస్ధితిలో లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితేనే భారత్‌కు తిరిగివస్తారని ఆయన న్యాయవాది గత నెలలో పేర్కొఆన్నరు. నకిలీ గ్యారంటీలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల మేర టోకరా వేసిన చోక్సీ, ఆయన మేనల్లుడు జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ కోసం దర్యాప్తు సంస్ధలు గాలిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు