పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

6 Nov, 2019 05:10 IST|Sakshi

క్యాపిటల్‌ మార్కెట్లపై ఎస్‌టీటీ, సీజీటీ, జీఎస్‌టీల భారం

దీంతో వర్ధమాన మార్కెట్లతో పోటీపడలేని పరిస్థితి

ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ లిమాయే

ముంబై: బహుళ పన్నుల భారంతో మన క్యాపిటల్‌ మార్కెట్లు పోటీపడలేకపోతున్నాయని, పెట్టుబడుల రాకను పెంచేందుకు ప్రభుత్వం వీటిని తగ్గించాలని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ విక్రమ్‌ లిమాయే కోరారు. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ), మూలధన లాభాల పన్ను (సీజీటీ), స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అన్నవి భారత్‌ వర్ధమాన మార్కెట్లతో పోడీపడే విషయంలో విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి ఆరేళ కనిష్ట స్థాయికి చేరి, మందగమనం ఎదుర్కొంటున్న తరుణంలో విక్రమ్‌ లిమాయే ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘పన్నుల నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం అన్నది మన మార్కెట్ల ఆకర్షణీయతను గణనీయంగా పెంచుతుంది.

మరింత మంది పెట్టుబడులు పెట్టడం వల్ల లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది’’ అని ఎన్‌ఎస్‌ఈ 25 ఏళ్ల ప్రయాణం సందర్భంగా మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లిమాయే అన్నారు. అదే సమయంలో కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘‘భారత మార్కెట్ల పోటీ తత్వాన్ని పెంచేందుకు మొత్తం మీద లావాదేవీల వ్యయాలు (పన్నులు సహా), మార్జిన్లు, నిబంధనల అమలు వ్యయాలు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి, సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగిలను కోరుతున్నాను. అంతర్జాతీయంగా భారత వెయిటేజీ పెరిగేందుకు ఇది సాయపడుతుంది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను మన మార్కెట్లు ఆకర్షించగలవు’’ అని లిమాయే ప్రకటన చేశారు.

జన్‌ధన్‌ యోజన తరహా పథకం కావాలి...
సామాన్యులూ షేర్లలో ట్రేడ్‌ చేసుకునేందుకు గాను డీమ్యాట్‌ ఖాతాల ప్రారంభానికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన తరహా పథకం అవసరమని విక్రమ్‌ లిమాయే అన్నారు. అప్పుడు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్‌ సాయంతో ఇన్వెస్టర్లు ఖాతాను తెరిచేందుకు వీలుంటుందన్నారు.

త్వరలో మరిన్ని సంస్కరణలు ఉంటాయ్‌..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ముంబై: ప్రజలు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టబోతోందని  ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రభుత్వం గతంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రయతి్నంచినప్పటికీ .. రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో కొన్ని సాధ్యపడలేదని పేర్కొన్నారు. దేశం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.

అయితే, సంస్కరణల అమలుకు సంబంధించి ఈసారి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదని ఆమె స్పష్టం చేశారు. మందగమనం బాటలో ఉన్న ఆరి్థక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం.. భూ, కారి్మక చట్టాలు మొదలైన వాటికి సంబంధించి తక్షణమే సంస్కరణలు చేపట్టాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

>
మరిన్ని వార్తలు