రూ. 3.5 లక్షల కోట్లు మటాష్!

12 Jun, 2020 11:06 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనా వైరస్ మళ్లీ పంజా విసురనుందన్న అంచనాతో అమెరికా మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేశాయి. దీనికి తోడు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చన్న వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్టు కుప్పకూలాయి. కరోనా వైరస్, లాక్‌డౌన్  అనంతరం మార్చి తరువాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,800 పాయింట్లకు, ఎస్ అండ్ పి 500 5.9 శాతానికి పైగా పడిపోయింది. ఆసియా మార్కెట్లు ఇదే బాటపట్టాయి. జపాన్‌ నిక్కి 1.52 శాతం  చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, దక్షిణ కొరియాకు కోస్పి వరుసగా 0.51 శాతం, 1.03 శాతం, 2.48 శాతం పతనమయ్యాయి. దీంతో నేడు (శుక్రవారం) దేశీయంగా మన స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్  ఆరంభంలోనే ఏకంగా 1100 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టోయింది.  ఫలితంగా  బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 264,315 పాయింట్లు కోల్పోయాయి. ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తం ఆవిరై పోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది.  (స్టాక్ మార్కెట్ భారీ పతనం)


పెట్టుబడిదారులు రూ .3.51 లక్షల కోట్లు నష్టపోయారు. అలాగే మార్కెట్  క్యాప్ నిన్నటి (జూన్ 11) 133.14 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే  జూన్ 12 న శుక్రవారం బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .129.63 లక్షల కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో గురువారం 805.14 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మారు. దేశీయ పెట్టుబడిదారులు కూడా 874.35  కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించారు.  ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.   అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న సెన్సెక్స్  ప్రస్తుతం 635 పాయింట్లు క్షీణించి 32,908 వద్ద,  నిఫ్టీ 175 పాయింట్లు  కోల్పోయి 9723 వద్ద కొనసాగుతుండటం విశేషం.

చదవండి: ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం!
వామ్మో! పెట్రో బాదుడు 

మరిన్ని వార్తలు