ఐఫోన్‌ 8, 8 ప్లస్‌పై పేటీఎం భారీ క్యాష్‌బ్యాక్‌

11 Oct, 2017 11:02 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆపిల్‌ ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 29 నుంచి ఇవి విక్రయానికి వచ్చాయి. లాంచ్‌ అయిన వెంటనే ఈ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పలు ఆఫర్లను తీసుకొచ్చాయి. తాజాగా పేటీఎం కూడా ఈ కొత్త ఐఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలుచేసిన కస్టమర్లకు 15 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐఫోన్‌ 8, 8 ప్లస్‌ ఏది కొనుగోలు చేసినా తొలుత ఫ్లాట్‌ రూ.9,000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. యస్‌ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికైతే అదనంగా మరో రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ఆఫర్‌ చేయనుంది. ఈ ఆఫర్‌ కేవలం పేటీఎం వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

నిన్నటి నుంచి వాలిడ్‌లో ఉన్న ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌, రేపటి(అక్టోబర్‌ 12) వరకు ఉండనుంది. క్యాష్ బ్యాక్‌లో తొలుత రూ.9000ను కొనుగోలు చేసిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. అనంతరం నవంబర్‌ 20 లేదా అంతకంటే ముందు వరకు మిగిలిన రూ.6,000 క్యాష్ బ్యాక్ రీఫండ్‌ అవనుంది. పేటీఎంలో రూ.61,700గా లిస్టు అయిన ఐఫోన్‌ 8 64జీబీ వేరియంట్‌ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్‌ అనంతరం రూ.52,700గా ఉంది. అదేవిధంగా 64జీబీ వేరియంట్‌ ఐఫోన్‌ 8 ప్లస్‌ ధర రూ.9000 క్యాష్‌బ్యాక్‌ అనంతరం 61,195 రూపాయలు.  256జీబీ వేరియంట్‌ ఐఫోన్‌ 8, 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లు క్యాష్‌బ్యాక్‌ అనంతరం రూ.65,870గా, రూ.76,749గా ఉన్నాయి. ఒకవేళ యూజర్లు యస్‌ బ్యాంక్‌ యూజర్లు అయితే ఆ ధరలపై మరో 6,000 రూపాయలు తగ్గుతాయి.

మరిన్ని వార్తలు