2018లోనూ ఐపీఓల జోరు!

23 Dec, 2017 02:07 IST|Sakshi

ఈ ఏడాది 74 శాతం పెరిగిన ఐపీఓల సంఖ్య 

ఈవై తాజా నివేదిక వెల్లడి   

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌లు (ఐపీఓ) జోరుగా వచ్చాయని ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో దాదాపు 153 కంపెనీలు ఐపీఓల ద్వారా 1,160 కోట్ల డాలర్లు సమీకరించాయని వివరించింది. వచ్చే ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,

ఈ ఏడాది అక్టోబర్‌– డిసెంబర్‌ కాలానికి మొత్తం 22 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలానికి వచ్చిన ఐపీఓలతో పోలిస్తే ఇది 47% అధికం.
ఈ ఏడాది బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫార్మ్‌లపై వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య 153. గత ఏడాది వచ్చిన ఐపీఓలతో పోలిస్తే ఇది 74 శాతం ఎక్కువ. అంతేకాకుండా ఇటీవల కాలంలో రికార్డ్‌ స్థాయిలో నిధుల సమీకరణ కూడా ఇదే ఏడాది జరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను, పెరుగుతున్న ఇన్వెస్టర్ల పెట్టుబడి దాహాన్ని ప్రతిబింబిస్తోంది.
యూరప్, మధ్య ఆసియా, భారత్, ఆఫ్రికా(ఈఎంఈఐఏ) ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే  భారత్‌లోనే అధికంగా (550 కోట్ల డాలర్ల మేర) ఐపీఓల నిధుల సమీకరణ జరిగింది.
హా ఈఎంఈఐఏ ప్రాంతంలో అతి పెద్ద ఐపీఓగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొ ఐపీఓ నిలిచింది. ఈ కంపెనీ 170 కోట్ల డాలర్లు సాధించింది.
ఈఎంఈఐఏ ప్రాంతంలో టెక్నాలజీ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల ఐపీఓలు అగ్రస్థానాల్లో నిలిచాయి.
హా భారత్‌లో రాజకీయంగా సుస్థిరత నెలకొనడం, సంస్కరణలు కొనసాగుతుండటం, అమెరికాలో పన్ను సంస్కరణల కారణంగా భవిష్యత్తులో ఐపీఓల జోరు  కొనసాగుతుంది.
విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌పై మళ్లీ దృష్టిసారిస్తుండటం,  ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బాగా ఉండటంతో భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ వాతావరణం నెలకొన్నది.
రానున్న నెలల్లో పెట్టుబడులు పెట్టడానికి వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఆకర్షణీయంగా నిలవనున్నది. ఐపీఓ మార్కెట్‌ జోరుగా పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుండటం దీనికి ప్రధాన కారణాలు.
మార్కెట్‌ వేల్యుయేషన్లు అధికంగా ఉండటం వల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెద్ద స్థాయి వాటాదార్లకు తమ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించుకోవడం మంచి లాభాలు పొందే  అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు