ఐఆర్‌సీటీసీ ఐపీఓ అదుర్స్‌!

4 Oct, 2019 06:51 IST|Sakshi

అడిగింది... 650 కోట్లు

వచ్చింది... 72,000 కోట్లు

112 రెట్లు అధిక స్పందన... 

జారీ చేసేది 2 కోట్ల షేర్లు...

దరఖాస్తులు... 225 కోట్ల షేర్లకు

ఇష్యూ ధరల శ్రేణి రూ.317–320

ఈ నెల 14న మార్కెట్లో లిస్టింగ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) సూపర్‌ హిట్‌ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. మందగమనం ఉన్నప్పటికీ, కంపెనీ పై భవిష్యత్తు అంచనాలు ఆశావహంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించిందని నిపుణులంటున్నారు. ఈ ఐపీఓలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌  సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించింది. రూ.317–320 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నెల 14న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి.   రూ.150–200 రేంజ్‌లో లిస్టింగ్‌ లాభాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

225 కోట్ల షేర్లకు దరఖాస్తులు...
మొత్తం 2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తం సమీకరణ విలువ రూ.645 కోట్లు కాగా... దాదాపు రూ.72,000 కోట్ల విలువైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల(క్విబ్‌)కు కేటాయించిన వాటా 109 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 355 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 14.65 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే. క్విబ్, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల, ఉద్యోగుల వాటాల విషయంలో అత్యధిక బిడ్‌లు వచ్చాయి. రైల్వేలకు కేటరింగ్‌ సర్వీసులు అందించే ఏకైక కంపెనీ.. ఐఆర్‌సీటీసీయే. ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లు, ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను ఈ కంపెనీ విక్రయిస్తోంది.

మరిన్ని వార్తలు