ట్రైన్‌ టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త విధానం

4 May, 2018 12:16 IST|Sakshi

ఐఆర్‌సీటీసీ ట్రైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ను ఎప్పడికప్పుడు సులభతరం చేస్తోంది. తాజాగా తత్కాల్‌ లాంటి ఈ-టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త చెల్లింపు విధానాన్ని తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో తత్కాల్‌ కోటా కింద టిక్కెట్లతో పాటు ఈ-టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌ యూజర్లు బుక్‌ చేసుకోవచ్చని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పేర్కొంది. ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌ అనేది పేమెంట్‌ విధానం. యూజర్లు ముందస్తుగా దీనిలో నగదును డిపాజిట్‌ చేసి, ఈ-టిక్కెట్లు బుక్‌ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు.  

అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడం కోసం తత్కాల్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రయాణం చేయడానికి ఒక్క రోజు ముందు ఏసీ క్లాస్‌ తత్కాల్‌ టిక్కెట్లను ఉదయం 10 గంటలకు, నాన్‌ ఏసీ క్లాస్‌ టిక్కెట్లను 11 గంటలకు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప తత్కాల్‌ స్కీమ్‌ కింద బుక్‌ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటే, నగదును రీఫండ్‌ చేయరు. 

ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌ ద్వారా ఈ-టిక్కెట్ల బుకింగ్‌

  • తొలుత కస్టమర్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాలి
  • గరిష్టంగా యూజర్లు ఆరు బ్యాంకులను తమ ప్రాధాన్య జాబితాలో ఇవ్వాలి
  • మై ప్రొఫైల్‌ సెక్షన్‌లో బ్యాంకు ప్రాధాన్యతలను ఎప్పడికప్పుడు మేనేజ్‌ చేసుకోవచ్చు
  • ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్‌ సర్వీసును ఎంపిక చేసుకుని ప్రయాణికులు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు
  • ఇతర డిజిటల్‌ వాలెట్లను ద్వారా కూడా టిక్కెట్లను బుక్‌ చేసుకునే ఆప్షన్‌ను ఐఆర్‌సీటీసీ కస్టమర్లకు ఉంది
  • తత్కాల్‌ బుకింగ్‌ సిస్టమ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి రైల్వే పలు చర్యలను తీసుకుంటోంది. ఒక్క యూజర్‌ ఐడీ మీద కేవలం రెండు తత్కాల్‌ టిక్కెట్లను మాత్రమే బుక్‌ చేసుకునే సౌకర్యముంటుంది.
మరిన్ని వార్తలు