పీఏసీఎల్ ఇన్వెస్టర్లకు సెబీ సూచన
న్యూఢిల్లీ: పీఏసీఎల్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరింది. సంబంధిత అసలైన డాక్యుమెంట్లను ఇన్వెస్టర్లు తమ దగ్గరే ఉంచుకోవాలని, అడిగినప్పుడు వాటిని తమకు సమర్పించాలని పేర్కొంది. ప్రస్తుత స్కీమ్ల్లో నుంచి వేరే కొత్త స్కీమ్ల్లోకి మారాలని పీఏసీఎల్ గ్రూప్, ఆ సంస్థ ఏజెంట్లు ఒత్తిడి చేస్తారని, దీనికి తలొగ్గరాదని సెబీ ఇన్వెస్టర్లను సూచించింది. అలాగే పీఏసీఎల్కు సంబంధించి ఎలాంటి కొత్త స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేయరాదని సెబీ పేర్కొంది. పీఏసీఎల్ సంస్థ వ్యవసాయ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ప్రజల నుంచి 18 ఏళ్ల కాలంలో రూ.49,100 కోట్లు సమీకరించిందని సమాచారం.