ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!

29 Apr, 2020 13:50 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: : కరోనా కల్లోలంతో సంక్షోభంలో పడిన ఐటీ రంగానికి సంబంధించి, ప్రముఖ ఐటీ నిపుణుడు ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ ఆందోళనకర అంచనాలను వెలువరించారు. భారత ఐటీ రంగంలో కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ప్రభావం కారణంగా ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన ఉండబోదని వ్యాఖ్యానించారు. అలాగే సీనియర్ స్థాయి సిబ్బందికి 20-25శాతం జీతం కోత వుంటుందన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారనీ, ఇది ఇకముందు కూడా కొనసాగే  అవకాశం ఉందని  ఆయన పేర్కొన్నారు. (కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం)

ఐటీ పరిశ్రమలు ఈ ఏడాది కొత్తగా ఎవర్ని ఉద్యోగాల్లోకి తీసుకోవని, అయితే ఇప్పటికే ఇచ్చిన కమిట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకుంటాయని మోహన్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయని, లాక్‌డౌన్‌తో ఐటీ ఇండస్ట్రీలోని 90 శాతానికిపైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల ఇళ్లలో మౌలిక సదుపాయల కల్పన, ఆయా కంపెనీల క్లైంట్ల నుంచి భద్రతాపరమైన అనుమతి లభించడంతో వర్క్‌ఫ్రం హోం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని చెబుతాయన్నారు.

ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌ ఆరిన్‌ క్యాపిటల్, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌  చైర్మన్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ 25 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను వర్క్‌ఫ్రం హోంకు అనుమతిస్తామని చెప్పారని పాయ్ తెలిపారు. ఇక కార్యాలయాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఐటీ సెక్టార్‌లో కార్యాలయాలు మరింత విస్తరించడానికి అధికంగా స్థలం అవసరం అవుతుందని తాను భావించడం లేదన్నారు. 25శాతం మంది ఉద్యోగులను ఇంటి వద్దనుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సిబ్బందితో కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వచ్చే ఏడాది వరకు ఇప్పటి కార్యాలయాల్లోనే యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ)

ఒక వేళ ఎవరైనా ఒక ఉద్యోగి జాబ్‌ మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తిచేయరని కూడా  పాయ్ చెప్పారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల క్లైంట్లు ఎక్కువ మంది తమ కార్యాలయాలను ఇప్పటికీ తెరవలేదు. అందువల్ల ఐటీ కంపెనీలు రెండు మూడు త్రైమాసికాల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటాయని, దాదాపు  ఎలాంటి నియామాకాలు జరగబోవని చెప్పారు. అయితే వచ్చే ఏడాది నియామకాలు జరిగే అవకాశం వుందని  అనుకుంటున్నానని పాయ్ వెల్లడించారు. (రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్)

మరిన్ని వార్తలు