మార్కెట్‌ అక్కడక్కడే

3 Dec, 2019 06:08 IST|Sakshi

హెచ్చుతగ్గుల్లో సూచీలు

నిరాశపరిచిన జీడీపీ, వాహన విక్రయ గణాంకాలు 

కీలక రేట్ల కోతపై ఆశలు 

8 పాయింట్ల లాభంతో 40,802కు సెన్సెక్స్‌

8 పాయింట్లు తగ్గి 12,048కు నిఫ్టీ

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్‌ మార్కెట్‌ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్‌ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్‌బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి.   మొబైల్‌ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి.

మరిన్ని వార్తలు