చైనీస్‌ పరికరాలకు చెక్‌- ఐటీఐ స్పీడ్‌

18 Jun, 2020 11:54 IST|Sakshi

52 వారాల గరిష్టానికి ఐటీఐ

భారీగా ట్రేడింగ్‌ పరిమాణం

2 రోజుల్లో 32 శాతం హైజంప్‌

టెలికం రంగంలో చైనీస్‌ పరికరాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించనున్నట్లు వెలువడిన వార్తలు పీఎస్‌యూ  ఐటీఐ లిమిటెడ్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 14.5 శాతం దూసుకెళ్లింది. రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 108 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు రోజుల్లోనే ఈ కౌంటర్‌ 32 శాతం జంప్‌చేసింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 9.3 మిలియన్‌ షేర్లు చేతులు మారడం గమనార్హం!

డాట్‌ దన్ను
చైనా కంపెనీల నుంచి 4జీ పరికరాల కొనుగోలును నిలువరించవలసిందిగా ప్రభుత్వ రంగ కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను టెలికం శాఖ(డాట్‌) ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. చైనా కంపెనీల నుంచి దూరంగా ఉండాల్సిందిగా ప్రయివేట్‌ రంగ టెలికం దిగ్గజాలను సైతం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఐటీఐ షేరుకి డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ విభాగంలో  పీఎస్‌యూ అయిన ఐటీఐ లిమిటెడ్‌ సేవలందిస్తున్న విషయం విదితమే. కంపెనీ డిఫెన్స్‌ సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్‌, ఆప్టికల్‌, డేటా నెట్‌వర్క్‌, పాసివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర పలు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా టెలికం టర్న్‌కీ ప్రాజెక్టులుసహా టెలికం సొల్యూషన్స్‌నూ అందిస్తోంది. 

మరిన్ని వార్తలు