ధరల మంట: రీటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం

12 Feb, 2020 18:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై  తీవ్ర ఆందోళన,. కొనసాగుతుండగానే జనవరి నెలలో రీటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌  అంచనాలకుమించి  ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది.  డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది.సీపీఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) బుధవారం  వెల్లడించింది.  2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతంగా ఉంది. 

ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్‌లో 14.12 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (-) 2.17 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్‌లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు,  ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగంతో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ‍్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల  ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు.

కాగా  ఫిబ్రవరి  నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచింది.  ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతానికి (2 శాతం మార్జిన్‌తో) అటూ ఇటూగా వుండాలే చూడాలని కేంద్రానికి ఆర్‌బీఐ  ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్‌ జోన్‌లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది.

చదవండి :  దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

మరిన్ని వార్తలు