భారత్ మౌలిక రంగంపై జపాన్ దృష్టి!

30 May, 2016 03:49 IST|Sakshi
భారత్ మౌలిక రంగంపై జపాన్ దృష్టి!

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
* ఆరు రోజుల పర్యటన ప్రారంభం
టోక్యో: జపాన్ ఇన్వెస్టర్లు భారత్ మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉత్సుకత చూపుతున్నారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆరురోజుల జపాన్ పర్యటనను ప్రారంభించారు. ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆయన ఈ పర్యటన ప్రారంభమైంది. తొలి రోజు పర్యటనలో జైట్లీ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషీ సన్‌తో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
 
ఇంటర్నెట్, సోలార్ ఎనర్జీలో పెట్టుబడులకు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కసరత్తు
జైట్లీతో సమావేశం అనంతరం మసయోషీ సన్ విలేకరులతో మాట్లాడుతూ, ఇంటర్నెట్ కంపెనీలు, సోలార్ విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు తమ సంస్థ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగంలో ఇప్పటికే తమ కంపెనీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతీ ఎంటర్‌ప్రైజెస్ అండ్ తైవాన్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిందని వెల్లడించారు.
 
మరో అర శాతం రేటు కోత: మోర్గాన్ స్టాన్లీ
ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో అరశాతం రెపోరేటు కోత నిర్ణయం తీసుకుంటుందని రేటింగ్ దిగ్గజ సంస్థ- మోర్గాన్‌స్టాన్లీ అంచనావేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2017 నాటికి 4.7 శాతంగా ఉంటుందని, ఇది  రేటు కోతకు దారితీసే ప్రధాన అంశమని తన తాజా నివేదికలో వివరించింది.

మరిన్ని వార్తలు