జేపీ గృహవినియోగదారులకు ఊరట

11 Sep, 2017 14:56 IST|Sakshi
జేపీ గృహవినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని జేపీ ఇన్ఫోటెక్‌ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. అంతకముందు విచారణ సందర్భంగా జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై చేపట్టిన దివాలా ప్రొసీడింగ్స్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, సోమవారం వెలువరించిన తీర్పులో అక్టోబర్‌ 27 వరకు 2000 కోట్ల రూపాయలను తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఈ సంస్థను ఆదేశించింది. అంతేకాక ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను, ఇతర డైరెక్టర్లను దేశం విడిచి పారిపోకుండా నిర్భంధిస్తున్నట్టు పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ను టేకోవర్‌ చేసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటుచేసిన తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్‌( ఐఆర్‌పీ) బాడీని ఆదేశించింది. ఫ్లాట్‌ కొనుగోలుదారుల,  క్రెడిటార్ల ప్రయోజనాలను ఎలా రక్షిస్తారో 45 రోజుల్లో తమకు తెలుపాలంటూ ఐఆర్‌పీని ఆదేశించింది.
ఈ మేరకు ఓ రిజుల్యూషన్‌ ప్రణాళికను సమర్పించాలని కూడా తెలిపింది.. సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన ఆదేశాల మేరకు జేపీ అసోసియేట్స్‌ సిస్టర్‌ కంపెనీ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి లేదు. అయితే డిపాజిట్‌ చేయాల్సిన రూ.2000 కోట్ల కోసం భూమి విక్రయాలు లేదా ఐఆర్‌పీ అనుమతితో ఏ ప్రాపర్టీనైనాన విక్రయించుకోవచ్చని అపెక్స్‌ కోర్టు తెలిపింది. సెప్టెంబర్‌ 4న ఈ కంపెనీపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ జారీచేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.    
మరిన్ని వార్తలు