జెట్‌ పునరుద్ధరణపై ఆశలు

24 Apr, 2019 00:37 IST|Sakshi

  మెజారిటీ వాటాల కొనుగోలుపై   బ్రిటన్‌ వ్యాపారవేత్త జేసన్‌ ఆసక్తి

సంస్థ సీఈవో దూబేకు లేఖ

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్‌ వ్యాపారవేత్త జేసన్‌ అన్స్‌వర్త్‌.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్‌ సీఈవో వినయ్‌ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర సీనియర్‌ జెట్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా ఏర్పాటు చేశారని అన్స్‌వర్త్‌ తెలిపారు. వాటాల కొనుగోలు కోసం జెట్‌ రుణదాతలకు కూడా గతంలో లేఖ రాసినప్పటికీ.. వారి నుంచి ఇంకా స్పందన రాలేదని ఆయన వివరించారు. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు జీతభత్యాలు అందుకునేలా, సంస్థ మరిన్ని అసెట్స్‌ను కోల్పో కుండా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చూడాలన్నది నా ఉద్దేశం‘ అని అన్స్‌వర్త్‌ తెలిపారు. అట్మాస్ఫియర్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎయిర్‌లైన్స్‌ పేరిట స్టార్టప్‌ సంస్థను ప్రారంభించిన అన్స్‌వర్త్‌.. లండన్‌లోని స్టాన్‌స్టెడ్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారత్, దుబాయ్‌ తదితర ప్రాంతాలకు ఈ ఏడాది ఆఖర్లోగా విమాన సేవలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ప్లాన్‌ ఉంది..
జెట్‌ సమస్యలు, అప్పుల భారాల గురించి తనకు తెలుసని, వాటిని అధిగమించేందుకు తన దగ్గర ప్రణాళిక కూడా ఉందని అన్స్‌వర్త్‌ తెలిపారు. అట్మాస్ఫియర్‌పై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లలో కొంత మంది జెట్‌పై కూడా ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. 2015లో అట్మాస్ఫియర్‌ను ఏర్పాటు చేసినప్పటినుంచీ వివిధ స్థాయిల్లో వివిధ సంస్థలతో కలిసి పనిచేయడమనేది జెట్‌ పునరుద్ధర ణకు తోడ్పడగలదని చెప్పారు. కంపెనీ విలువ మరింత పడిపోకుండా సాధ్యమైనంత త్వరగా సం స్థ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యేలా చూడటం ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే చాలా మంది జెట్‌ ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లిపోతున్నారని, అట్మాస్ఫియర్‌ ఎయిర్‌లైన్స్‌ భారత విభాగానికి కూడా జెట్‌ ఉద్యోగుల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. 

విదేశీ రూట్లపై దృష్టి..
ప్రధానంగా విదేశీ రూట్లలో సేవలపై దృష్టి పెట్టడం ద్వారా జెట్‌ను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు అన్స్‌వర్త్‌ చెప్పారు. సవాళ్లున్నప్పటికీ చౌక చార్జీల విమానయాన సంస్థలతో పోలిస్తే పూర్తిస్థాయి ఎయిర్‌లైన్స్‌కు దీర్ఘకాలంలో అవకాశాలు పుష్కలం గా ఉన్నాయన్నారు. వినోదం, రిఫ్రెష్‌మెంట్స్‌తో సరైన రేటుకి ప్రీమియం అనుభూతినివ్వడం ఇం దుకు కీలకమని చెప్పారు. భారీ రుణభారంతో కుంగుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌ 17న సర్వీసులను నిలిపివేసింది. దీంతో 20,000 మంది పైచిలుకు ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కంపెనీని రుణదా తలు వేలానికి ఉంచాయి. ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, ఎన్‌ఐఐ ఎఫ్‌ సంస్థలు షార్ట్‌లిస్ట య్యాయి. ఇవి మే 10లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంది. అయితే ప్రధానమైన స్లాట్స్, వి మానాలు, పైలట్లు, ఉద్యోగులు సంస్థ చేజారిపో తుండటంతో బిడ్డర్స్‌ కూడా ఆసక్తి చూపకపోవచ్చే మోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

స్లాట్స్‌ కేటాయింపు తాత్కాలికమే: కేంద్రం
విమానాశ్రయాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ స్లాట్స్‌ను ఇతర సంస్థలకు కేటాయించడం తాత్కాలికం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంగళవారం తెలిపింది. జెట్‌ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించిన వెంటనే తిరిగి అప్పగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల రద్దు కార ణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకే మూడు నెలల పాటు తాత్కాలికంగా జెట్‌ స్లాట్స్‌ను ఇతర ఎయిర్‌ లైన్స్‌కు ఇవ్వనున్నట్లు కేంద్రం వివరించింది. స్లాట్స్‌ కేటాయింపు పారదర్శ కంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిటీలో ఏవియేషన్‌ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ, ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ తదితర సంస్థల ప్రతినిధులు ఉంటారు.   

మరిన్ని వార్తలు