జియో బ్రాడ్‌బ్యాండ్‌కు రిజిస్ట్రేషన్లు షురూ 

16 Aug, 2018 00:26 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సెకనుకు ఒక గిగాబిట్‌ వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తామని జియో హామీ ఇస్తోంది. జియోడాట్‌కామ్‌ వెబ్‌సైట్, మైజియో యాప్‌ ద్వారా కనెక్షన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ‘జియోగిగాఫైబర్‌. గిగాబిట్‌ వైఫై, టీవీ, స్మార్ట్‌ హోం, ఫ్రీ కాలింగ్‌ వంటి మరెన్నో ఫీచర్స్‌ పొందండి‘ అంటూ మైజియో యాప్‌లో కంపెనీ ప్రకటించింది.

టారిఫ్‌ల యుద్ధం...
ప్రస్తుతం పోటీ సంస్థలు హోమ్‌ యూజర్స్‌కి సెకనుకు 100 మెగాబిట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అందిస్తున్నాయి. ఇందుకు చార్జీలు నెలకు సుమారు రూ. 1,000 దాకా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు 10 రెట్లు వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామని జియో చెబుతోంది. చార్జీల గురించి ఇంకా వెల్లడించకపోయినప్పటికీ.. మిగతా కంపెనీలకు గట్టి పోటీనిచ్చే విధంగానే ఉండవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న..పెద్ద సంస్థలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రారంభించనున్నట్లు జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు