జియో అద్భుత ఫీచర్‌.. అమితాబ్‌తో వీడియో కాలింగ్‌..!

3 May, 2018 22:14 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియో ఇన్ఫోకాం లిమిటెడ్‌ (జియో) ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత జియో ఇంటరాక్ట్‌ వేదికను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ వేదికలో ఎన్నో సేవలు అందుబాటులోకి రానుండగా.. తొలుత ‘లైవ్‌ వీడియో కాల్‌ ఫీచర్‌’ను జియో ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్‌తో భారతీయ సినీ దిగ్గజాలతో నేరుగా మాట్లాడిన అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు. దానిలో భాగంగానే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ త్వరలో ప్రారంభించబోయే ‘102 నాటౌట్‌’ కామెడీ షోని ఈ లైవ్‌ వీడియో కాల్‌ ఫీచర్‌తో జియో తన వినియోగదారులకు అందించనుంది.

ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్కై‍బర్లు, 150 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగ దారులతో భారతీయ టెలికాం రంగంలో జియో విశిష్టమైన స్థానంలో నిలిచింది. తాజాగా ప్రారంభమయ్యే జియో ఇంటరాక్ట్‌ సేవలతో దేశంలోని మూవీ ప్రమోషన్‌ సేవల్లో అగ్రగామిగా జియో అవతరించనుంది. కొద్ది రోజుల్లోనే వీడియో కాల్‌ సెంటర్లు, వీడియో కేటలాగ్‌, వర్చువల్‌ షో రూమ్‌లు ప్రవేశ పెట్టి తమ సేవలు అందిస్తామని జియో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, కృత్రిమ మేధతో వినియోగదారులకు ఇంత గొప్ప సేవలు అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

‘లైవ్‌ వీడియో కాల్‌’ విత్‌ అమితాబ్‌
జియో ఇంటరాక్ట్‌లో మొదటి సర్వీస్‌గా లైవ్‌ వీడియో కాల్‌ నిలవనుంది. జియో కస్టమర్లు ఈ ఫీచర్‌తో మే 4న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా ‘మై జియో అప్లికేషన్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. యాప్‌ డౌన్‌లోడ్‌ తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్‌ చేసి.. స్టార్ట్‌ వీడియో కాల్‌పై నొక్కితే చాలు అమితాబ్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు. ఆయన కామెడీ షో 102 నాటౌట్‌పై ప్రశ్నలు కూడా అడగవచ్చు. మొత్తం మీద జియో వినూత్న ఆఫర్లతో తన వినియోగదారులకు తీపి కబురు అందించింది.

>
మరిన్ని వార్తలు