-

ఆ ఫోన్లకు ఎయిర్‌టెల్‌ బంపర్‌ ప్లాన్స్‌

28 Jul, 2017 17:28 IST|Sakshi
ఆ ఫోన్లకు ఎయిర్‌టెల్‌ బంపర్‌ ప్లాన్స్‌
టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన రిలయన్స్‌జియో, ఫీచర్‌ ఫోన్‌ ఇండస్ట్రీ రూపురేఖలనూ మార్చేయడానికి వచ్చేసింది. జీరోకే జియో ఫోన్‌ లాంచ్‌ చేసేసింది. లో-ఎండ్‌ సెగ్మెంట్‌లో మార్పులు మాత్రమే కాక, తాము తీసుకొచ్చిన జియో ఫోన్‌తో టెలికాం దిగ్గజాలకు భారీగా షాకివ్వాలని ఈ కంపెనీ సిద్ధమవుతోంది. కానీ ఇప్పటికే టెలికాం మార్కెట్‌లో తమను కోలు​కోలేని దెబ్బతీస్తున్న జియోకు ఎలాగైనా చెక్‌పెట్టాలని ఎయిర్‌టెల్‌ కూడా ప్లాన్‌ చేస్తోంది. జియో ప్రభావానికి గురికానున్న ఫీచర్‌ ఫోన్‌ తయారీదారులతో ఎయిర్‌టెల్‌ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. ఫోన్లను తయారుచేసే ఉద్దేశ్యమే లేదని ప్రకటించిన ఈ టెలికాం దిగ్గజం‌, ఇన్వెంటరీని కొనసాగించనున్నట్టు తెలిపింది. అంతేకాక, 4జీ ఫీచర్‌ ఫోన్‌ తయారీదారులతో చేతులు కలుపాలని చూస్తున్నట్టు టెలికాం వర్గాలు చెప్పాయి.
 
వీరితో చేతులు కలిపి, ఆ డివైజ్‌ల కోసం బంపర్‌ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్ ఆవిష్కరించబోతుందట‌. 2018 మార్చి వరకు తమ 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం జియో మాత్రమే వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. లావా మాత్రమే ప్రస్తుతం 4జీ ఫీచర్‌ ఫోన్‌గా మార్కెట్‌లో ఉంది. జియో ఫోన్‌ వచ్చేంత వరకు ఇది ఒక్కటే 4జీ ఫీచర్‌ ఫోన్‌. మరోవైపు మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, కార్బన్‌లు కూడా 4జీ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇతర చిన్న బ్రాండులు కూడా ఆ హ్యాండ్‌సెట్లను తయారుచేసేందుకు సిద్దమవుతున్నాయి. కాగ, స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇప్పటికే తమ యూజర్లను కోల్పోకుండా బంపర్‌ ఆఫర్లను ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. ఇదే వ్యూహాన్ని ఫీచర్‌ ఫోన్లకు కొనసాగించాలని చూస్తోంది. ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ జియో తమ పతనాన్ని కోరుతుండటంతో ఎయిర్‌టెల్‌ ఈ వ్యూహాలను రచిస్తోంది.   
మరిన్ని వార్తలు