ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

19 Jul, 2019 13:18 IST|Sakshi

వినియోగదారుల పరంగా సెకండ్‌ ప్లేస్‌లో జియో

టాప్‌ ప్లేస్‌లో వోడాఫోన్‌ ఐడియా

సాక్షి, ముంబై : రిలయన్స్‌ జియో  ఇన్ఫోకామ్ లిమిటెడ్ మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ముఖ్యంగా  మొబైల్ చందాదారుల పరంగా  ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండవ అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. మరోవైపు  వొడాఫోన్‌ ఐడియా టాప్‌ప్లేస్‌ను నిలబెట్టుకుంది. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా  శుక్రవారం  ఈ వివరాలను వెల్లడించింది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది.  వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కాగా మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  నేడు (శుక్రవారం)  క్యూ1 (ఏప్రిల్-జూన్ త్రైమాసికం) ఫలితాలను ప్రకటించనుంది.  బలమైన చందాదారులను తన ఖాతాలో వేసుకున్న జియో మెరుగైన ఆదాయాన్ని వెల్లడించనుందని  భావిస్తున్నారు. అయితే 329 మిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ 119 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదిస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆశిస్తుండగా, ఆర్పూ(ఏఆర్‌పీయూ, వినియోగదారుకు సగటు ఆదాయం)125కు పడిపోతుందని భావిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 111 బిలియన్ డాలర్ల  ఆపరేటింగ్‌ రెవెన్యూని సాధించగా రూ. 840 కోట్ల లాభాలను సాదించింది. మార్చి చివరి నాటికి 306 మిలియన్ల చందాదారులున్నారు. 
 

మరిన్ని వార్తలు