జియో రూ.49 ఆఫర్‌ కేవలం వారికే కాదు

30 Jan, 2018 11:20 IST|Sakshi

అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఉచితంగా 4జీ డేటా ప్రకటనతో రెండేళ్ల క్రితం రిలయన్స్‌ జియో టెలికాం మార్కెట్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చౌకైన టారిఫ్‌ ప్లాన్లతో టెల్కోలను ముప్పు తిప్పలు పెడుతోంది. అచ్చం అలాంటి సంచలన ప్రకటన మాదిరిగానే జియో ఇటీవల టెల్కోలకు మరో షాకిచ్చింది. అదే రూ.49 ప్లాన్‌. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, 1జీబీ డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. ఇంత చౌకైన రెంటల్‌ ప్లాన్‌ను మరే ఇతర కంపెనీ కూడా ఆఫర్‌ చేయడం లేదు. కానీ ఇది కేవలం జియోఫోన్‌ యూజర్లకేనని అధికారికంగా ప్రకటించడంతో, జియో వినియోగదారుల్లో కాస్త నిరాశవ్యక్తమైంది. ఆ నిరాశను పారదోలుతూ.. మరో గుడ్‌న్యూస్‌ వెలువడింది. ఈ ప్లాన్‌ను జియోసిమ్‌ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని తెలిసింది. 

అయితే అదెలా అంటే...? జియోఫోన్‌ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్‌ రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రూ.153 ప్లాన్‌, రూ.49 ప్లాన్‌. ఈ ప్లాన్లను ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి తొలుత మీ జియోసిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియోఫోన్‌ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేసి, యాక్టివేట్‌ చేసుకోవాలి. జియోఫోన్‌పై ఈ ఆఫర్లను యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం, సిమ్‌ను బయటికి తీసి, మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్లను వాడుకోవాలనే నిబంధననేమీ లేదు. దీంతో ఈ రెండు ప్లాన్లకు ఇది వాలిడ్‌లో ఉంటుంది. అంటే జియో తీసుకొచ్చిన సంచలన ఆఫర్‌ రూ.49ను ప్రతి ఒక్క జియో సిమ్‌ వినియోగదారులు వాడుకోవచ్చన మాట. కానీ ముందుగా ఈ ప్లాన్‌ను జియోఫోన్‌లో యాక్టివేట్‌ చేసుకోవడం మాత్రమే చేయాలి. అనంతరం ఏ ఫోన్‌లోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 
 

మరిన్ని వార్తలు