రాబడిలో జియో టాప్‌

25 Nov, 2018 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్‌ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్‌)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్‌ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్‌లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్‌ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్‌టెల్‌ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో నిలిచింది. ఇదే త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ రెవిన్యూ మార్కెట్‌ వాటా రూ 1284 కోట్లుగా నమోదైంది. ఆయా కంపెనీల ఏజీఆర్‌ల ఆధారంగానే  లైసెన్స్‌ ఫీజు, ఇతర ఫీజుల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రాబడిని లెక్కిస్తారు.

ఇక గత ఏడాది రిలయన్స్‌ జియో ఏజీఆర్‌ ఈ త్రైమాసికంలో రూ 7125 కోట్లుగా నమోదైంది. ఇక స్ధూల రాబడిలో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ల తర్వాత జియో మూడో స్ధానానికి పరిమితమైంది. రూ 13,542 కోట్లతో వొడాఫోన్‌ ఐడియా ట్రాయ్‌ జాబితాలో ముందువరుసలో నిలవగా, రూ 11,596 కోట్ల స్ధూల రాబడితో ఎయిర్‌టెల్‌ తర్వాత స్ధానంలో నిలిచింది. ఇక రిలయన్స్‌ జియో రూ 10,738 కోట్ల స్థూలలాభాన్ని ఆర్జించింది. మరోవైపు ఏజీఆర్‌ మార్కెట్‌ వాటాలో 22 టెలికాం సర్కిళ్లలో 11 సర్కిళ్లలో జియో ముందుండగా, ఆరు సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌, 5 టెలికాం సర్కిళ్లలో వొడాఫోన్‌ ఐడియా భారీ రాబడిని రాబట్టాయని ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు