జియో గిగాఫైబర్‌ టారిఫ్‌ ప్లాన్స్‌ ఇవేనట!

2 Aug, 2018 14:00 IST|Sakshi
జియోగిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో.. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్లోనూ తన సత్తా చూపేందుకు వచ్చేస్తోంది. జియోగిగాఫైబర్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన 41వ వార్షిక సాధారణ సమావేశంలో లాంచ్‌ చేసింది. ఇళ్లకు, ఆఫీసులకు, దుకాణాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా హై-స్పీడ్‌ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా జియోగిగాఫైబర్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనే జియోగిగాటీవీ సేవలను అందించబోతుంది.

ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు 41వ ఇన్వెస్టర్ల సమావేశంలోనే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. కానీ ఆ సమయంలో జియోగిగాఫైబర్‌ టారిఫ్‌లను రివీల్‌ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ టారిఫ్‌ ప్లాన్లపై కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో జియోగిగాఫైబర్‌ టారిఫ్‌ ప్లాన్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్‌లైన్‌లో కొన్ని టారిఫ్‌ ధరలు చక్కర్లు కొడుతున్నాయి. 

అవేమిటో ఓ సారి చూద్దాం.. 
500 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌...
జియోగిగాఫైబర్‌ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్‌ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్‌ తగ్గిపోనుందని సమాచారం.

750 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌...
తర్వాత ప్లాన్‌ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్‌. ఈ ప్లాన్‌ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్‌ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్‌లోకి వస్తుందని టాక్‌.

999 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌....
600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్‌పై పొందవచ్చట. దీని స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ అని తెలుస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం.

1,299 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌....
ఈ ప్లాన్‌ ఎఫ్‌యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట. 

1,599 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌....
జియోగిగాఫైబర్‌ కింద అందించే హైయస్ట్‌ ప్లాన్‌ ఇదేనట. ఈ ప్లాన్‌ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్‌ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్‌ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్‌. 

జియోగిగాఫైబర్‌ రిజిస్ట్రేషన్లు...
జియోగిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రిజిస్ట్రేషన్లను రిలయన్స్‌ జియో ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. జియో అధికారిక వెబ్‌సైట్‌ లేదా మైజియో మొబైల్‌ అప్లికేషన్‌ నుంచే దీని రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్‌ కాబోతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో అక్కడ తొలుత దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

మరిన్ని వార్తలు