జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే!

27 Apr, 2020 14:42 IST|Sakshi

ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ : జియో మార్ట్ వాట్సాప్ నంబరు

 ముంబై, థానే, కళ్యాణ్‌లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సేవలు ప్రారంభం

సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో మెగా ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు రోజుల తరువాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోలో జియో రీటైల్ వెంచర్  జియో మార్ట్  ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సేవల  కార్యక్రమాన్ని మొదలు పెట్టేసింది.  వాట్సాప్ సహకారంతో  కిరాణా సరుకులను అందించే ఆన్‌లైన్ పోర్టల్‌ను  టెస్టింగ్ కోసం లాంచ్ చేసింది. కరోనా వైరస్  లాక్‌డౌన్‌  కష్టాలు కొనసాగుతున్న వేళ వాట్సాప్ ఆధారిత ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ సేవలు ప్రస్తుతం నవీ ముంబై, థానే, కళ్యాణ్‌లో మొదలు పెట్టింది.  జియోమార్ట్, దాని కొత్త భాగస్వామి వాట్సాప్‌తో కలిసి,ఈ ప్రాజెక్ట్  పైలట్ రన్‌ను త్వరలోనే  అన్ని  రాష్ట్రాలకు విస్తరించనుంది. (ఫేస్‌బుక్‌ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)

జియో మార్ట్ ద్వారా సరుకుల బుకింగ్ 

  • జియో మార్ట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు గాను క‌స్ట‌మ‌ర్లు ముందుగా త‌మ పేరు, చిరునామా, ఫోన్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాల‌ను నమోదు చేయాలి. త‌రువాత త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇందుకు జియోమార్ట్ 88500 08000 నంబరును  మొబైల్స్ లో సేవ్ చేసుకోవాలి. అనంత‌రం వాట్సాప్‌లో ఆ నంబ‌ర్‌కు  హాయ్  అని మెసేజ్ పంపాలి.
     
  • ఆర్డర్‌ను కోసం జియోమార్ట్ ఒక లింక్‌ను అందిస్తుంది. ఈ లింక్ 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావల్సిన సరుకులను ఎంచుకున్న తర్వాత, జియోమార్ట్ ఇన్‌వాయిస్‌తో పాటు సమీపంలోని స్టోర్  గూగుల్ మ్యాప్స్‌లో స్థానం,  చిరునామా, దాన్ని లింక్ ను షేర్ చేస్తుంది.
     
  • ఆర్డర్ కు సంబంధించిన సరుకులు సిద్ధం అయ్యాక  సంబంధిత స్టోర్ నుంచి వినియోగదారుడికి ఎస్ఎంఎస్ వస్తుంది.  ప్రతీరోజు సాయంత్రం 5 గంట‌లలోపు చేసిన ఆర్డ‌ర్ల‌కు ఆ త‌రువాతి 48 గంట‌ల్లోగా డెలివ‌రీ అవుతుంది. లేదా క‌స్ట‌మ‌ర్లు  స్టోర్ వద్దే డబ్బులు  చెల్లించడంతోపాటు, వస్తువులను అక్కడే తీసుకోవాల్సి వుంటుంది.

ప్రస్తుతానికి సంస్థ ఆన్‌లైన్ చెల్లింపులను అంగీకరించదనీ, త్వరలోనే ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని  జియో తెలిపింది. వినియోగదారులు వివిధ గృహ ఆహార ఉత్పత్తులను రాయితీ ధరలకు మాత్రమే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. వినియోగదారులు ఆర్డర్‌లను సవరించడానికి, లేదా రద్దు చేయడానికి ఆస్కారం లేదనీ, బిల్లింగ్‌కు ముందు  సదరుకిరణా షాపులోనే ఇలాంటివి చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత కష్టతరమైన సమయంలో జియో మార్ట్ మెగా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుందని ఫిన్నోవిటి కన్సల్టింగ్ ఫౌండర్  పీఎన్ విక్రమన్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌తో ఒప్పందంతో  జియోమార్ట్ విస్తరణలో వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

కాగా టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను రూ.44 వేల కోట్ల‌కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌తో క‌లిసి జియోమార్ట్ సేవ‌ల‌తో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు  షాకివ్వనుంది. 
 

>
మరిన్ని వార్తలు