జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్

10 Apr, 2020 12:25 IST|Sakshi

సాక్షి, ముంబై: కొత్త కొత్త ప్లాన్లు, మార్పులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్  మహమ్మారి కష్టాల్లో  ఉన్న జియో వినియోగదారులు ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో ఒక యాప్  ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చు. 

ఈ యాప్ ను డైరెక్టుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి  ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులభం. పైగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు. ఇప్పటికే మైజియో యాప్, జియో వెబ్సైట్ ను ఉపయోగించి ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్  చేసే అవకాః ఉన్నప్పటికీ, ఆ రీచార్జ్ లపై కమిషన్ చెల్లించదు. తాజా యాప్ ద్వారా వినియోగదారులు కమిషన్ పొందవచ్చు.  అంతేకాదు ఇందులో పాస్ బుక్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు గత 20 రోజుల్లో నిర్వహించిన లావాదేవీలు, వచ్చిన కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు.  (కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం)

రిజిస్ట్రేషన్ ఎలా? 
జియోపోస్ లైట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని... సంబంధిత అనుమతులు పూర్తయినాక, జియో నెంబరు నమోదు చేయాలి. ఇలా  రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాలెట్ లో రూ .500, రూ .1000, రూ .2000 లాంటి ఆప్షన్లతో డబ్బును నింపమని యాప్ అడుగుతుంది. అలాగే రీఛార్జ్ ప్రణాళికలను చూపుతుంది. దీన్ని ఎంచుకొని రీచార్జ్ చేసినప్పుడు 4.16 శాతం కమీషన్ పొందవచ్చు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.  ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్ కు ఈ సదుపాయం లేదు.  (వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్)

కాగా కోవిడ్-19 కరోనా వైరస్, లాక్డౌన్ ఇబ్బందుల మధ్య  వినియోగదారులకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు పలు సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అదనపు డేటా ప్రయోజనాలు, ఏటీఎం, ఎస్ఎంఎస్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. అలాగే జియోపోస్ లైట్ మాదిరిగానే, వొడాఫోన్ ఐడియా కూడా “రీఛార్జ్ ఫర్ గుడ్” ను ప్రారంభించింది. ఇందులో ప్రతీ రీఛార్జికి 6 శాతం కమీషన్  అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు