ఐదేళ్లలో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాలు

2 Jan, 2018 17:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏ దేశమైనా సాంకేతికంగా శరవేగంగా అభివద్ధి చెందుతుంటే దాని ప్రభావం కచ్చితంగా ఉద్యోగులపై ఉంటుందనేది తెల్సిందే. ఫలితంగా ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. పర్యవసానంగా పాత ఉద్యోగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులే కొత్త ఉద్యోగాల్లో కుదురుకోగలరు. మిగితా వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పదు. 2022 నాటికి భారత్‌లో కూడా ఈ పరిణామాలు సంభవిస్తాయని ‘యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ అనే మేనేజ్‌మెంట్‌ కన్సెల్టింగ్‌ సంస్థ డిసెంబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పలు రకాల పరిశ్రమలు, 130 మంది వ్యాపారవేత్తలు, పలువురు విద్యావేత్తల అభిప్రాయలను తెలుసుకోవడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. 

సర్వే ప్రకారం ఈ నాలుగేళ్ల కాలంలో ప్రస్తుతమున్న ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 20 నుంచి 35 శాతం వరకు ఉద్యోగాలు పోతాయి. ప్రతి మందిలో ఒకరికి కొత్త ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉనికిలోనే లేని ఆ ఉద్యోగం రేపు ఎక్కడా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. ముఖ్యంగా భారత టెక్‌ సెక్టార్‌లో ఉద్యోగాల నియామకం క్రమంగా మందగిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రత్యక్షంగా 38 లక్షల మంది పనిచేస్తుండగా, పరోక్షంగా 1.30 మంది పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో ఆధునిక సాంకేతిక జ్ఞానం అవసరం అవుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంను సమకూర్చుకోవడం వల్ల పాత ఉద్యోగులు పోతారు. కొత్త నియామకాలు తగ్గుతాయి. 

ఉదాహరణకు ఐటీ–బీపీఎం పురోభివద్ధి శాతం ఆరు శాతం ఉంటే నియమకాలు మూడు నుంచి మూడున్నర శాతం వరకు ఉంటాయి. 2022 నాటికి మూడొంతుల ఉద్యోగాలకు కొత్త నైపుణ్యం అవసరం అవుతుంది. ఐటీ–బీపీఎం రంగంలోనే 2022 నాటికి 45 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో నాలుగున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు కొత్తవి ఉంటాయని సర్వేలో అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్‌ రంగాల్లో కొత్త స్కిల్స్‌ అవసరం అవుతాయని, ఒక్క ఐటీ–బీపీఎంలోనే కాకుండా వెలుపలున్న ఐటీ రంగంలో కూడా భారీగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. 

మరిన్ని వార్తలు