2017లో 1.6 లక్షలకు సంపన్న కుటుంబాల సంఖ్య
కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక
ముంబై: దేశీయంగా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య 1.60 లక్షల పైకి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అయితే, వీరి ఉమ్మడి సంపద మాత్రం సుమారు అయిదు శాతమే వృద్ధి చెంది.. రూ. 153 లక్షల కోట్లుగా నమోదైంది.
కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ తరఫున అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు రూ. 25 కోట్ల పైగా సంపద ఉన్న కుటుంబాలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో సంపన్న కుటుంబాల సంఖ్య 3.30 లక్షలకు, నికర సంపద విలువ రూ. 352 లక్షల కోట్లకు చేరవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు.