న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్ష జరపనుంది. అయితే ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... మంగళవారం సమీక్ష సందర్భంగా ఆర్బీఐ తాజా రెపో రేటు నిర్ణయం ఏదీ తీసుకోబోదని పలు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 6.75 శాతంగా ఉంది. గత క్యాలెండర్ ఇయర్లో రెపో రేటును ఆర్బీఐ 1.25 శాతం తగ్గించింది.
రానున్న బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనాలను పరిశీలించిన తర్వాతే రేటు కోతపై ఒక నిర్ణయం ఉంటుందని యస్బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఇక రేపటి సమీక్ష సందర్భంగా రేటు కోత ఉండదని సిటీగ్రూప్, హెచ్ఎస్బీసీ వంటి ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. బడ్జెట్లోని అంశాలను పరిశీలించిన తర్వాత మార్చి, ఏప్రిల్లో ఈ రేటు పావుశాతం తగ్గే వీలుందని సిటీ గ్రూప్ అంచనా, అయితే ఫిబ్రవరి 2న పావు శాతం రేటు కోత ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడుతోంది.