టెకీలను వెంటాడుతున్న లేఆఫ్స్‌..

11 Nov, 2019 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్థిక​ మందగడనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు మధ్య, సీనియర్‌ ఐటీ ఉద్యోగుల్లో 5 నుంచి 8 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నాయి. రానున్న త్రైమాసికాల్లో దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఐటీ ఉద్యోగులపై వేటు వేయవచ్చని బిజినెస్‌ స్టాండర్డ్‌ అంచనా వేసింది. మార్జిన్ల నిర్వహణ, అమెరికాలో నియామకాలు ఊపందుకోవడం, నూతన టెక్నాలజీల రాక వంటి అంశాలు టెకీల తొలగింపునకు దారితీశాయని ఆ కథనం పేర్కొంది.

రూ 20 లక్షల నుంచి రూ 40 లక్షల వార్షిక వేతనం అందుకునే ప్రాజెక్టు మేనేజర్లకు ఉద్యోగాలు కోల్పోయే ముప్పు అధికమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశాలను విస్పష్టంగా వెల్లడించిన క్రమంలో ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టనున్నాయి. కాగ్నిజెంట్‌ 12,000 మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టిస్తుండగా, ఇన్ఫోసిస్‌ 10,000 మంది ఉద్యోగులను సాగనంపనుందనే వార్తలు వెలువడ్డాయి. ఉద్యోగుల సామర్థ్యం, వార్షిక సమీక్షలో భాగంగా ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు