గతవారం బిజినెస్

3 Aug, 2015 01:31 IST|Sakshi

నియామకాలు
♦ ఐటీ శాఖ కార్యదర్శి రామ్ సేవక్ శర్మను ట్రాయ్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
♦ ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర గ్రూప్ ఎండీ గౌర శ్రీనివాస్ నియమితులయ్యారు.

  మార్కెట్ విస్తరణ దిశగా ఉబెర్
 ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్‌లో సుమారు రూ.6,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.

  భారత్‌లో జనరల్ మోటార్స్ పెట్టుబడులు
 అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్‌లో దాదాపు రూ.6,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్‌అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది మోడళ్లను అందిస్తామని జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బర్రా చెప్పారు.  

 100 విమానాల కొనుగోలు దిశగా స్పైస్‌జెట్
 దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచి స్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ మొదలైన  వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్‌వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

  హెచ్‌సీఎల్‌లో వాటా విక్రయ దిశగా కేంద్రం
 డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)లో 15 శాతం వాటాను విక్రయించనుంది. హెచ్‌సీఎల్‌లో కేంద్రం వాటా 89.95 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా రూ.69,500 కోట్ల నిధుల సమీకరణను లక్ష్యంగా నిర్దేశించుకుంది.

 7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
 కేంద్రప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిలో హాత్‌వే కేబుల్ అండ్ డేటా కామ్, హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్,  లాలియా ట్రేడింగ్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి.

 17 మంది పన్ను బకాయిలు.. 2 లక్షల కోట్లు
 దేశంలో 17 మంది వ్యక్తులు రూ.2.14 లక్ష ల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ రూ.1,000 కోట్లపైన పన్ను బకాయి పడినవారే. దేశంలోని 35 కంపెనీలు రూ.1,000 కోట్ల పైబడి కట్టాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.90,568 కోట్ల కన్నా సంబంధిత 17 మంది వ్యక్తులు చెల్లించాల్సింది దాదాపు రెట్టింపు.

  ఐసీఐసీఐ లాభం రూ.2,976 కోట్లు
 ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16,క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన(బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే) రూ.2,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,655 కోట్లతో పోలిస్తే లాభం 12 శాతం ఎగసింది.

  టెక్ మహీంద్రా లాభం రూ.676 కోట్లు
 ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రై మాసికంలో రూ.676 కోట్ల నికర లాభం ఆర్జించింది.అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ. 631కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా పేర్కొంది. రూపాయి క్షీణతతో లాభాలు పెరిగాయని వివరించింది.

  ఐటీసీ నికర లాభం రూ.2,265 కోట్లు
 ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ... ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.2,265 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.2,186 కోట్లు)తో పోల్చితే 4% వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. సిగరెట్ల అమ్మకాలపై ఒత్తిడి, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల నికర లాభంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది.

  మారుతీ సుజుకీ లాభం 56 శాతం అప్
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఏకంగా 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు పెరగడం, విదేశీ మారక విలువలు సానుకూలంగా ఉండటంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు సత్ఫలితాలిస్తుంటడం దీనికి దోహదపడినట్లు సంస్థ తెలిపింది.

 సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు
 సహారా గ్రూప్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్  లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్‌కు సహారా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది.

   విండోస్ 10 వచ్చేసింది..
 సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్‌లోకి విడుదలైన రెండు రోజుల్లోనే విండోస్ 10 ఓఎస్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ల సంఖ్య 1.4 కోట్లకు చేరింది.

 అమెరికా జీడీపీ వృద్ధి 2.3 శాతం
 అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది 2వ క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో సానుకూల రీతిలో 2.3 శాతంగా నమోదయ్యింది. వినియోగ వ్యయం పెరగడం(అమెరికా ఆర్థిక క్రియాశీలతలో ఈ విభాగం వాటా దాదాపు 70 శాతం), ఎగుమతుల్లో వృద్ధి వంటి అంశాలు దీనికి కారణమని వాణిజ్య శాఖ గురువారం పేర్కొంది.
 
 డీల్స్..
  ఇజ్రాయెల్ ఫార్మా
 దిగ్గజం తెవా.. అంతర్జాతీయ ఔషధ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. ఐర్లాండ్ సంస్థ అలెర్గాన్ జనరిక్స్‌ను ఏకంగా 40.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో 33.75 బిలియన్ డాలర్లు నగదు రూపంలో, మిగతాది (6.75 బిలియన్ డాలర్లు) తెవా షేర్ల రూపంలో అలెర్గాన్ జనరిక్స్ మాతృ సంస్థ అలెర్గాన్ పీఎల్‌సీకి లభిస్తాయి.

  జ్యూయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్‌కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు.

  దివాలా తీసిన అమెరికన్ సంస్థ ఎరిక్ బ్యుయెల్ రేసింగ్ (ఈబీఆర్)కి సంబంధించిన కొన్ని వ్యాపారాలను దేశీ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ 2.8 మిలియన్ డాలర్లకు దక్కించుకోనుంది.

  దేశీ బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా కొనుగోలు చేయనుంది. డీల్ విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉండొచ్చని అంచనా.

మరిన్ని వార్తలు