గతవారం బిజినెస్‌

14 Aug, 2017 00:53 IST|Sakshi
గతవారం బిజినెస్‌

సేవింగ్స్‌పై వడ్డీ కోత: యాక్సిస్‌ బ్యాంక్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్‌ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5% వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథా ప్రకారం 4% గానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది.  

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి
ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై మధ్య 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది రూ.1.90 లక్షల కోట్లు. 2017–18 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.80 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్‌లో లకి‡్ష్యంచారు. తాజా వసూళ్ల మొత్తం ఇందులో 19.5 శాతంగా ఉంది.

ఆర్‌బీఐ డివిడెండ్‌ చిక్కి సగమైంది!
కేంద్రానికి ఆర్‌బీఐ చెల్లించే డివిడెండ్‌ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఈ కాలానికి సంబంధించి ఆర్‌బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముం దటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు.

ఎంసీఎక్స్‌లో బంగారం ఆప్షన్ల కాంట్రాక్టులు
బంగారంపై ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రారంభించేందుకు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)కు సెబీ ఆమోదం తెలిపింది. ’’బంగారం ఫ్యూచర్స్‌లో ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పటికే మాక్‌ ట్రేడింగ్‌ కూడా నిర్వహించాం. ఇన్వెస్టర్లలో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించాం. రానున్న కొన్ని వారాల్లో ఆప్షన్ల కాంట్రాక్టు సైజు, ఇతర వివరాలతోపాటు, ప్రారంభ తేదీని ప్రకటిస్తాం’’ అని ఎంసీఎక్స్‌ ప్రతినిధి గిరీష్‌దేవ్‌ తెలిపారు.  

జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!
పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్‌ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 % క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్‌ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1% క్షీణించిందన్నమాట. 2016 జూన్‌లో వృద్ధి భారీగా 8%గా ఉంది. గడిచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ’క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77% వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది.

వాహన విక్రయాలు రయ్‌ రయ్‌
ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో జూలై నెలలో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. జీఎస్‌టీ అమలు తర్వాత డీలర్లు స్టాక్‌ను మళ్లీ నింపుకోవడం దీనికి ప్రధాన కారణం. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం.. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జూలైలో 15.12 శాతం వృద్ధితో 2,59,720 యూనిట్ల నుంచి 2,98,997 యూనిట్లకు పెరిగాయి. కార్ల అమ్మకాలు 8.52 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,77,639 యూనిట్ల నుంచి 1,92,773 యూనిట్లకు ఎగశాయి.

ఆరు కంపెనీలపై ట్రేడింగ్‌ ఆంక్షలు ఎత్తివేత
పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ సహా ఆరు కంపెనీలకు  ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో శాట్‌ పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్‌ డెవలపర్స్, కవిట్‌ ఇండస్ట్రీస్, పిన్‌కాన్‌ స్పిరిట్, సిగ్నెట్‌ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్‌ ఇండియా బీఎఫ్‌ఎస్‌ఐ, కెకల్పన ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్‌ ఆదేశించింది. 331 అనుమానిత షెల్‌ కంపెనీలపై సెబీ ట్రేడింగ్‌ ఆంక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే.

డీల్స్‌..
♦ ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కి చెం దిన సాఫ్ట్‌బ్యాంక్‌ భారీగా పెట్టుబడులు పెట్టిం ది. సాఫ్ట్‌ బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ ద్వారా 2.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది.
♦ భారతి ఎయిర్‌టెల్‌..తన టవర్ల కంపెనీ భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 3.65 శాతం వాటా (6.5 కోట్ల షేర్లు) విక్రయించి, రూ. 2,570 కోట్ల నిధుల్ని సమీకరించింది.
♦  సాఫ్ట్‌వేర్‌ కన్సల్టింగ్‌ కంపెనీ నెట్‌లింక్స్‌.. శ్రీవెంకటేశ్వర గ్రీన్‌ పవర్‌ ప్రొజెక్ట్స్‌ లిమిటెడ్‌లో 51% వాటాను కొనుగోలు చేసింది.
♦ పీకల్లోతు కష్టాలోఉన్న సహారా గ్రూప్‌కు చెందిన యాంబీ వ్యాలీ ప్రాజెక్ట్‌లో 1.67 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 10,700 కోట్లు) పెట్టుబడికి మారిషస్‌కు చెందిన ఇన్వెస్టర్‌ రాయలీ పార్ట్‌నర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఆఫర్‌ ఇచ్చింది.
♦ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ తన అనుబంధ కంపెనీ అయిన పెన్నార్‌ రెన్యువబుల్స్‌లో తనకున్న వాటాను గ్రీన్‌కో సోలార్‌ ఎనర్జీకి విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.

ఐపీవో కాలమ్‌..
♦ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (జీఐసీ) ప్రతిపాదిత ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను(డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.  
♦  న్యూ ఇండియా అష్యూరెన్స్‌ (ఎన్‌ఐఏ) ఐపీవోకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ఎన్‌ఐఏ ఐపీవో ద్వారా కేంద్రం 9.6 కోట్ల షేర్లను, ఎన్‌ఐఏ సొంతంగా 2.4 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి.

మరిన్ని వార్తలు