అతి చౌకగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా

27 Apr, 2020 15:30 IST|Sakshi

26.7 కోట్ల  ఫేస్‌బుక్  వినియోగదారుల డేటా  డార్క్ వెబ్ లో ప్రత్యక్షం

సాక్షి, న్యూఢిల్లీ : అతిపెద్ద డేటా లీక్ కుంభకోణంపై గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి లీకుల ఇబ్బందుల్లో పడింది.  తాజాగా ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది వినియోగ‌దారుల సమాచారం  అతి చౌగాగా  అమ్ముడు పోయిందన్న వార్త‌  అటు యూజర్లలో ఆందోళన రేపుతోంది. 267 మిలియన్ల మంది అంటే దాదాపు 26 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల ప‌ర్స‌న‌ల్ డేటా ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ  ‘సైబుల్’  వెల్లడించింది. వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో  లాంటి వివరాలన్నీ ‘డార్క్ వెబ్’ కు విక్రయించినట్టు  పేర్కొంది.  ప్రస్తుతానికి, ఈ డేటా ఉల్లంఘనకు కారణం తెలియనప్పటికీ ఫేస్‌బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను దొంగలించి ఉండే అవకాశం ఉందని   సైబుల్ అభిప్రాయ‌ప‌డింది.  

ఫేస్‌బుక్ యూజర్ల డేటా ‘డార్క్ వెబ్’ లో అమ్మకానికి పెట్టినట్టుగా ఇది ధృవీకరించింది. 300 మిలియన్లకు పైగా డేటా లీక్ కావడంపై సైబుల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.  ప్రొఫైల్‌తో సహా డార్క్ వెబ్లో అందుబాటులో  267 మిలియన్ యూజర్ల డేటా  కేవలం 543 డాలర్లు (రూ. 4138 )కే లభ్యం కావడం  సెక్యూరిటీ భద్రతను ప్రశ్నల్ని లేవనెత్తుతోందని పేర్కొంది. అయితే పాస్ వర్డ్ మాత్రం భద్రంగా ఉన్నాయనీ, యూజర్ల డేటాను రక్షణకు కఠిన పద్దతులను పాటించాలని సూచించింది. లేదంటే ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని  హెచ్చరించింది.    

మరిన్ని వార్తలు