74 శాతం ఏటీఎంల పరిస్థితి అంతే..!

21 Jul, 2018 16:24 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏటీఎంలలో ఈ మధ్య పెద్ద ఎత్తున్న మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అవి అవుట్‌ డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో పనిచేయడమేనట. దేశంలో కనీసం 74 శాతం ఏటీఎంలు అవుట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నాయని, దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25 శాతం మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అసమర్థతపై తలెత్తిన ప్రశ్నలు సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. 75 శాతం వరకు ఏటీఎంలు అన్‌సపోర్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో నగదును పంపిణీ చేస్తున్నాయని.. దీంతో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపింది. దేశంలో చాలా వరకు ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే ఉన్నాయని, 89 శాతం వాటికి చెందినవేనని పేర్కొంది.

గత కొన్ని నెలలుగా ఏటీఎంలలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు విపరీతంగా అందినట్టు కూడా చెప్పింది. రిజర్వు బ్యాంక్‌ వద్ద పలు ఫిర్యాదులు దాఖలైనప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఇంకా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడం లేదు. గత నెలలో ఆర్‌బీఐ ఓ అడ్వయిజరీ నోట్‌ను సైతం జారీ చేసింది. నగదును సరఫరా చేసే సిస్టమ్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. 2017 జూలై నుంచి 2018 జూన్‌ వరకు కాలంలో డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు మోసాలపై అథారిటీల వద్ద 25వేల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మధ్యన హ్యాకర్లు కొత్త కొత్త పద్ధతులతో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి బ్యాంకులు తమ సిస్టమ్‌లను పూర్తిగా అప్‌టూడేట్‌ చేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు