లెమన్‌ ట్రీ డెబ్యూ అదిరింది

9 Apr, 2018 19:23 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆతిథ్య రంగ సంస్థ లెమన్‌ ట్రీ హోటల్స్‌  మొట్టమొదటి ట్రేడింగ్‌లో అదరగొట్టింది. మొట్టమొదటి ట్రేడింగ్‌లోనే లాభాల మోతమోగించింది.  లిస్టింగ్‌లో 10 శాతం ప్రీమియాన్ని సాధించిన  లెమన్‌ ట్రీ  హోటల్స్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ ఆద్యంతం జోరుగా సాగింది.  ఇష్యూ ధర రూ. 56కాగా ఆరంభంలోనే 10శాతం  దూసుకెళ్లింది. అనంతరం దాదాపు 32శాతానికి పైగా ఎగిసింది. చివరికి  28 శాతం లాభంతో 73.90వద్ద ముగిసింది. గత నెలాఖరున ఐపీవోకి వచ్చిన కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి.

ఐపీవోలో భాగంగా లెమన్‌ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్‌ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా మిడ్‌ రేంజ్‌లో  దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్‌ ట్రీ హోటల్స్‌ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్‌ ట్రీ ప్రీమియం, లెమన్‌ ట్రీ, రెడ్‌ ఫాక్స్‌ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు