‘బీమా’లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు ఎల్‌ఐసీ ఓకే!

14 Sep, 2014 01:09 IST|Sakshi
‘బీమా’లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు ఎల్‌ఐసీ ఓకే!

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన మద్దతును తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. ఇటీవల జరిగిన సెలక్ట్ కమిటీ సమావేశాల్లో ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్ పరిమితి పెంపునకు సానుకూలంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే 15 మంది సభ్యుల సెలక్ట్ కమిటీలోని ఒక వర్గం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  
 
ఇంతక్రితం ఎఫ్‌డీఐ పరిమితి పెంపును వ్యతిరేకించిన ఎల్‌ఐసీ తాజాగా తన ధోరణిని ఎందుకు మార్చుకుందన్న అంశంపై సమావేశంలో  వాడివేడి చర్చ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులూ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న బీమా బిల్లుపై నవంబర్ చివరి వారంలో తమ నివేదిక సమర్పించడానికి కమిటీ ప్రయత్నిస్తుందని సమావేశం అనంతరం చైర్మన్ చందన్ మిశ్రా అన్నారు.

మరిన్ని వార్తలు