ఓబీసీ నష్టం రూ.1,750 కోట్లు

9 Nov, 2017 00:25 IST|Sakshi

నాలుగింతలైన కేటాయింపులు

స్వల్పంగా తగ్గిన నికర ఎన్‌పీఏలు

ముంబై: ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.153 కోట్ల నికర లాభం సాధించామని, కానీ ఈ క్యూ2లో రూ.1,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం బాగానే పెరిగినప్పటికీ,  మొండి బకాయిలకు కేటాయింపులు నాలుగు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని వివరించింది. ఇతర ఆదాయం 82 శాతం వృద్ధితో రూ.1,059 కోట్లకు, నిర్వహణ లాభం 62 శాతం వృద్ధితో రూ.1,551 కోట్లకు పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.775 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.3,281 కోట్లకు చేరాయని,  ఈ క్యూ1లోని కేటాయింపులు(రూ.1,470కోట్లు)తో పోల్చితే దాదాపు రెట్టింపయ్యాయని వివరించింది.  

స్థూల మొండి బకాయిలు రూ.24,409 కోట్లనుంచి రూ.26,432 కోట్లకు పెరగ్గా, నికర మొండి బకాయిలు రూ.14,809 కోట్ల నుంచి రూ.14,129 కోట్లకు తగ్గాయని ఓబీసీ తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 14.83 శాతం నుంచి 16.3 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 9.56 శాతం నుంచి 9.44 శాతానికి తగ్గాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,316 కోట్ల నుంచి 5 శాతం క్షీణించి రూ.1,252 కోట్లకు తగ్గిందని వివరించింది. రుణాలు 5 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణాలు 0.3 శాతం క్షీణించాయి.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్‌ 6 శాతం క్షీణించి రూ.128 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు