ఆర్ధిక గణాంకాల నిరాశ!

13 Sep, 2019 10:57 IST|Sakshi

పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం

జూలైలో ఉత్పత్తి వృద్ధి 4.3 శాతం

గత ఏడాది ఇదే నెల్లో 6.5% వృద్ధి

అదుపులోనే ఉన్నా... రిటైల్‌ ద్రవ్యోల్బణం పైకే!

ఆగస్టులో 3.21 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు పైకి

న్యూఢిల్లీ: ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి గురువారం వెలువడిన కీలక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5 శాతం. అయితే నెలవారీగా చూస్తే మాత్రం కొంత బెటర్‌. 2019 జూన్‌లో ఈ వృద్ధి రేటు అతి తక్కువగా 1.2 శాతంగా నమోదయ్యింది. కాగా రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా, (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 4 శాతం లోపు) ఆగస్టులో ఇది అప్‌ట్రెండ్‌లోనే ఉంది. 3.21 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో నమోదయ్యింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. గణాంకాల్లో  ముఖ్యాంశాలను చూస్తే...

తయారీ రంగం పేలవం...
మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జూలైలో నిరాశ కలిగించింది.  తయారీ రంగం 4.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటే, 2018 ఇదే నెలలో ఈ రేటు 7 శాతంగా ఉంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 జూలైలో సానుకూలంగా ఉంటే, మిగిలినవి నేలచూపులు చూశాయి. ఇందులో పేపర్, పేపర్‌ ఉత్పత్తుల తయారీ పారిశ్రామిక గ్రూప్‌ భారీగా –15.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మోటార్‌ వెహికల్స్‌ తయారీ విభాగంలో రేటు –13.3%. ప్రింటింగ్, రీప్రొడక్షన్‌ విభాగంలో క్షీణత రేటు –10.9 శాతంగా ఉంది.  
క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతంగా ఉన్న క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా – 7.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు కనీసం 2.3%గా ఉంది.  
విద్యుత్‌: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 4.8 శాతానికి పడింది.  
కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఫ్రిజ్‌లు, టీవీల వంటి ఈ విభాగంలో ఉత్పాదకత – 2.7 క్షీణించింది.
మైనింగ్‌:  కొంచెం మెరుగుపడింది. వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది.  
కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌: సబ్బులు ఇతర ప్యాకేజ్డ్‌ గూడ్స్‌ వంటి  ఫాస్ట్‌ మూవింగ్‌ వినియోగ వస్తువుల విభాగంలో మాత్రం వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంది.  
నాలుగు నెలల్లోనూ నేలచూపే...
ఆరి్థక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (ఏప్రిల్‌–జూలై) పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.4 శాతంగా ఉంది.

10 నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.21 శాతానికి పెరిగింది. గడచిన పది నెలల కాలంలో ఇంత అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. మాంసం, చేపలు, కూరలు, పప్పు దినుసుల వంటి ఆహార ఉత్పత్తుల అధిక ధరలు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని గణాంకాలు వివరిస్తున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో(2 శాతం అటుఇటుగా) ఉండాలని ఆర్‌బీఐ నిర్దేశిస్తోంది. ఈ లెక్కన ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఆర్‌బీఐ  రెపోరేటు ను (ప్రస్తుతం 5.4%) మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో ఫుడ్‌ బాస్కెట్‌ ధరల స్పీడ్‌ 2.36% (జూలైలో) 2.99 శాతానికి పెరిగింది. చేపలు, మాంసం బాస్కెట్‌ ధర 8.51% పెరిగితే, పప్పు ధాన్యాల ధరలు 6.94% ఎగశాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 6.9% పెరిగాయి.

>
మరిన్ని వార్తలు