దేశంలో తొలిసారిగా మహబూబ్నగర్లో ఏర్పాటు
పాలమూరు: మహీంద్రా గ్రూపు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ల విక్రయంలోకి అధికారికంగా ప్రవేశించింది. దేశంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ‘ట్రాక్టర్ బాజీ’ పేరిట బుధవారం ఈ కేంద్రాన్ని ఎం అండ్ ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతో సాహా, జోనల్–1 హెడ్ విజయ్శర్మ, తెలంగాణ రీజినల్ మేనేజర్ మహావీర్ మాథూర్ ఆరంభించారు. పాత ట్రాక్టర్లకు మరమ్మత్తు చేసి టీఆర్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసి కొత్త ఆర్సీ ఇవ్వడంతో పాటు లబ్ధిదారుడికి ఏడాది వారంటీ ఇవ్వడం ఈ ‘ట్రాక్టర్ బాజీ’ ప్రత్యేకత.
షోరూమ్ను ప్రారంభించిన అనంతరం సుబ్రతో సాహా, స్థానిక జయరామ ఆటోమొబైల్స్ ఎండీ బెక్కరి రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బయటి మార్కెట్ కంటే ఈ ఎక్సే్ఛంజ్ బజార్లో తక్కువ ధరలు ఉంటాయని, పాత ట్రాక్టర్ను పూర్తిగా 81 రకాల మరమ్మతులు చేసి కొత్త ట్రాక్టర్గా మార్పు చేసి విక్రయిస్తామని చెప్పారు. ‘‘ట్రాక్టర్ బాజీ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. పాత ట్రాక్టర్ ఇచ్చి కొత్త ట్రాక్టర్ కొనే అవకాశంతో పాటు కేవలం ట్రాక్టర్ను విక్రయించటం కూడా చేయొచ్చు’’ అని తెలియజేశారు.